కేసీయార్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో సిధ్ధహస్తుడు. ఆయన ఎటునుంచి ఎటైనా బాణాలు వేయగలరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి మంత్రిగా పనిచేసిన కేసీయార్ కు తెలుగు నేల ఆనుపానులు అన్నీ బాగా తెలుసు. అంతకంటే నాయకుల మనసులో ఏముందో ఇంకా బాగా తెలుసు. అన్నీ తెలిసిన కేసీయార్ సరైన సమయంలోనే రియాక్ట్ అవుతారు. అపుడది మామూలుగా ఉండదుగా.
అమరావతి రాజధాని అగ్గి ఇపుడు ఏపీలో రాజుకుంది. అసలు రాజధాని ఉంటుందా వూడుతుందా అన్న డౌట్లు అందరిలోనూ కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణా నుంచి అమరావతి రాజధాని మీద కేసీయార్ చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు పెద్ద చర్చకు తావిచ్చేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో నిన్న మాట్లాడిన కేసీయార్ మాటల మధ్యలో అమరావతి నిర్మాణం గురించి ప్రస్తావించారు.
అమరావతి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను సూచించినట్లుగా కేసీయార్ తెలంగాణా నిండు సభలో చెప్పడం విశేషం.
53 వేల కోట్లతో అమరావతి రాజధాని కడతాను అని చంద్రబాబు అంటే తాను కట్టకయ్యా అది శుద్ద వేస్ట్, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని బాబుకు చెప్పానని కేసీయార్ అనడం విశేషం. అంత పెద్ద ఎత్తున డబ్బులు వ్రుధా చేసే బదులు రాయలసీమకు నీళ్ళు తీసుకుపో చంద్రబాబూ అని కూడా చెప్పానని కేసీయార్ అనడం విశేషం. మొత్తానికి అమరావతి నిర్మాణం ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని, ఏపీ స్వర్గధామం అవుతుందని అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్న వేళ, చంద్రబాబు సైతం అమరావతి ప్రపంచ రాజధాని అని తెల్లారిలేస్తే డప్పు కొట్టిన వేళ పక్క రాష్ట్రం సీఎం అది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పడం విశేషమే.
కేసీయార్ కి ఆంధ్రా అభివ్రుధ్ధి గిట్టదు కాబట్టి ఇలా అంటున్నాడని టీడీపీ తమ్ముళ్ళు విమర్శించవచ్చును కానీ అసలు దేశంలోనే ఎన్నతగిన నిపుణులు, నిష్ణాతులు ఉన్న శివరామక్రిష్ణన్ కమిటీ, పర్యావరణ వేత్తలు కూడా అదే చెప్పారుగా. పైగా అక్కడ సింకింగ్ శాయిల్ లో ఎంత లోతుగా పునాదులు వేసినా ముప్పేనని భవన నిర్మాణ రంగం నిపుణులూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అమరావతి రాజధాని అని కలవరిస్తున్న టీడీపీ, వంత పాడుతున్న ఇతర విపక్షాల వారు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కేసీయార్ మాటలు కూడా కొంత పట్టించుకుంటే బాగుంటుందేమో.