అధికారంలో ఉన్నపుడే కాదు
చివరకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు వరుసగా ఫెయిలవుతునే
ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా విఫలమైన చంద్రబాబు ఇపుడు ప్రతిపక్ష నేతగా ఘోరంగా
విఫలమయ్యారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పాలనపై కాదు చంద్రబాబు
సమీక్షించాల్సింది. ప్రతిపక్ష నేతగా తన నూరు రోజుల నాయకత్వంపైనే చంద్రబాబు
సమీక్షించుకోవాలి.
నిజానికి అధికారంలోకి వచ్చిన వారికి నూరు రోజులంటే పెద్ద సమయమేమీ కాదు. అందులోను ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ పరిస్ధితి చాలా దారుణంగా ఉంది. చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోతూ జగన్ కు ఖాళీ ఖజానాను అప్పగించారు. సరే పన్ను వసూళ్ళన్నవి నిరంతరం జరుగుతుంటాయి కాబట్టి ఏదో పద్దతిలో రోటేట్ అవుతుంది. అందుకనే తానిచ్చిన హామీలను ఆచరణలోకి పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
సరే ఇక చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా టిడిపి కార్యకర్తలపై వైసిపి నేతలు టార్గెట్ పెట్టి దాడులు చేయటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడైనా గొడవలు జరిగినా చెదురుమదురు గొడవలు, వ్యక్తిగత కక్షలతో జరిగినవే కానీ పార్టీ పరంగా జరిగిన గొడవలు కావు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు కావాలనే జగన్ పై బురద చల్లటానికి రాజకీయంగా రచ్చ చేస్తున్నారు.
గడచిన నూరు రోజుల జగన్ పాలనలో ఇసుక సరఫరాపై బ్యాన్ పెట్టటం, అన్న క్యాంటిన్లను ఉన పళంగా మూసేయటం లాంటి నిర్ణయాలు మాత్రమే నేరుగా జనాలపై ప్రభావం చూపేవి. ఇక పోలవరం, పిపిఏల సమీక్ష, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ లాంటి వాటి వల్ల జనాలకు ఏమీ ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి చంద్రబాబు అండ్ కో కు మాత్రమే.
అందుకే వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారు. జగన్ పై ఆరోపించటానికి నిర్దిష్టంగా ఏమీ లేకపోవటంతోనే టిడిపిపై వైసిపి దాడులని, బాధిత శిబిరాలని ఏదేదో యాగీ చేస్తున్నారు. కాబట్టి నూరు రోజుల్లో ప్రతిపక్షనేతగా చంద్రబాబే ఫెయిలయ్యారని చెప్పాలి.