నేడు తెలంగాణా విమోచన దినోత్సవాన్ని తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఘనంగా నిర్వహించుకొన్నాయి. 1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని. కానీ... అప్పటి నైజా సంస్థానంలో మాత్రం ప్రజలకు నిజాం పాలకుల నుంచీ విముక్తి లభించలేదు. అంటే.. తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లభించనట్లే. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ... మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్యం ఇస్తూనే సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం వాటికే ఇచ్చారు. ఫలితంగా మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్, జునాఘడ్, .హైదరాబాద్ (నైజాం). ఆ పరిస్థితుల్లో ఉక్కుమనిషి... సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ వహించి జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు.

 

మారణకాండకు పాల్పడ్డ రజ్వీ:

నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసిన ఖాసిం రజ్వీ మారణకాండకు పాల్పడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ తెలంగాణ ప్రజలు చూడని నరకం అంటూ లేదనే చెప్పాలి. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురు దాడికి దిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టి, ఉద్యమం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత, కేంద్ర సర్కార్  అప్రమత్తమైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే... భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా... నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు. ఆ రోజు... 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

 

ప్రతిపక్షాల డిమాండ్ ఇది:

అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంత సదాసీదాగా చెప్పుకునే అంశం కాదిది. అది చాలా పెద్దదనే చెప్పాలి. ఎన్నో త్యాగాల ఫలం అది. అందుకే ప్రతిపక్షాలు ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ... టీఆర్ఎస్ సర్కారు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్లే టీఆర్ఎస్ వెనకడుకు వేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: