జనసేన పార్టీ...ఏపీలో ఎన్నికల ముందు పురుడు పోసుకున్న పార్టీ. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ప్లాన్లు లేకుండా జనసేన నేత పవన్ కల్యాణ్ ముందుకు నడిచారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉండగా, ఏపీ రాజధాని విషయంలో, రైతుల విషయంలో పెద్దగా స్పందించని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం వైసీపీ సర్కార్ పాలన పగ్గాలు చేపట్టిన మూడునెలల్లోనే విమర్శలు ఎక్కుపెడుతున్నాడు.అయితే రాజధాని అయిన అమరావతిపై ఐదేళ్ల పాటు గెజిట్ విడుదల చేయని నారా చంద్రబాబుపై ఒక్కమాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్....ఇప్పుడు మూడు నెలల్లో మీరు ఎందుకు విడదల చేయరని సీఎం జగన్ను ప్రశ్నిస్తున్నారు. దీని బట్టి పవన్ టీడీపీ ట్రాప్లో ఉన్నారనే మాట రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. కాగా, రాష్ట్రంలో జనసేన, బీజేపీలు తనదైన శైలిలో ప్రయాణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడులపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రాజకీయంలో విమర్శలు చేయడం మాములే అయినా...ఏపీలో ఎదగాలని చూస్తున్న కమలం తన పార్టీని నడిపించే కీలక నేతల కోసం తీవ్రంగా అన్వేసిస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఏదో విధంగా లాగేయాలని ప్రయత్నించినా... అది సాధ్యం కాలేదు.కానీ ఇప్పుడు బీజేపీ కన్ను పవన్ కల్యాణ్ పార్టీ జనసేనపై పడింది. అందుకు ఒక కారణం కూడా ఉందనే చెప్పాలి. చంద్రబాబుకు మరో వ్యాపకం లేదు కాబట్టి, అధికారంలోకి లేకున్నా... కష్టమో, నష్టమో, పార్టీని ఐదేళ్ల పాటు అంటిపెట్టుకుని ఉండి ప్రభుత్వంపై పోరాటమో...ఆరాటమమో కొనసాగిస్తాడు. ఎక్కడేం దిక్కు లేకపోవడంతో ప్రజల సమస్యలు అంటూ అడ్డం పెట్టుకుని పోరాడడమే తప్పా..చేసేదేమి ఉండదు.
పవన్ రాజకీయంగా యాక్టివ్ ఉండలేరా..?
ఇక జనసేన విషయానికొస్తే..పవన్ కల్యాణ్ ఎన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ముందుకు సాగుతాడు చెప్పలేని పరిస్థితి. ఇక వచ్చే ఐదేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయంగా మాత్రం యాక్టివ్ ఉండలేరని పలువురు చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండటం ఎందుకని భావిస్తున్న పవన్, నాగబాబు లాంటి వాళ్లే మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా, పవన్ కల్యాణ్కు గతంలో అడ్వాన్స్లు ఇచ్చిన నిర్మాతల నుంచి కూడా తీవ్రంగా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి జనసేన క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా ఏ మాత్రం బలం లేదు. దీంతో పవన్ పార్టీలోని కీలక నాయకులు అభద్రత భావంతో ఉన్నారు.
పవన్ పార్టీకి కమల దళం గాలం వేస్తోందా..?
ఈ నేపథ్యంలో వీరికి బీజేపీ గాలం వేస్తోందనే మాట రాష్ట్రంలో కోడై కూస్తోంది. అయితే త్వరలో జనసేన ఖాళీ అవుతుందనే ప్రచారం కూడా రాజకీయ నాయకుల్లో జోరుగా కొనసాగుతోంది. పవన్ మాత్రం తాను జనసేనను ఏ పార్టీలో కలిపేది లేదని తెగేసి చెబుతున్నా... ఐదేళ్ల పాటు పార్టీని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఎప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.