తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక విపక్ష కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టినట్టే కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి ముందే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ? అనే విషయంలో ఆ పార్టీలో కాస్త గందరగోళానికి కారణమైంది. ఇక్కడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనతో రేవంత్ రెడ్డి వెంటనే కౌంటర్ ప్రకటన చేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి అభ్యర్థిని ఎలా ? ప్రకటిస్తారని.. కోదాడ లో ఓడిన పద్మావతి మళ్లీ హుజూర్నగర్ లో ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు.
అక్కడితో ఆగని రేవంత్ ఏకపక్షంగా అభ్యర్థి ప్రకటన చేసిన ఉత్తమ్కు నోటీసులు జారీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అసలు తనకు సంబంధం లేని విషయం లో రేవంత్ ఎందుకు ? జోక్యం చేసుకుని ఈ ప్రకటన చేశారా అన్న సందేహాలు చాలా మంది కి కలిగాయి. కొద్దిరోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు టీ కాంగ్రెస్ పెద్దలకు నచ్చటం లేదు. రేవంత్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాడు తమపై బోడి పెత్తనం చేయడం ఏంటన్న ఆక్రోశంతో వాళ్లు ఉన్నారు.
ఇక రేవంత్ కూడా పార్టీలో ఇలా ఉంటే పనవ్వదని తాడోపేడో తేల్చుకోవాలని కాస్త దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చి, ఎవరికో టికెట్ ఇప్పించాలని చూసి.. రేవంత్ రెడ్డి ఎదురుదెబ్బ తిన్నారు. తన అనుచరుడు అయిన చామల కిరణ్రెడ్డికి సీటు ఇప్పించుకోవాలని రేవంత్ చేసిన అత్యుత్సాహం దెబ్బతింది.
స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసిన చోట సహజంగా ఆయన చెప్పిన వాళ్లకే సీటు ఇస్తారు. అయితే ఇక్కడ రేవంత్ కావాలని గొడవకు దిగడం వెనక వేరే కథ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండాలని అనుకోవడం లేదని, ఆయన చూపు బీజేపీ వైపు మళ్లిందని.. చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన బీజేపీలోకి చేరబోతున్నారని కూడా ఒక టాక్ నడుస్తూ ఉండటం గమనార్హం! అందుకే రేవంత్ ఆయన డైరెక్షన్లో ఇక్కడ రాజకీయం నడుపుతున్నట్టు టాక్..?