మాజీ ఎంఎల్ఏ ఆమంచి
కృష్ణమోహన్ గురించి చీరాల జనాలు ఇలాగే అనుకుంటున్నారు. ఆమంచి గురించి ఇపుడెందుకు
చెప్పుకుంటున్నామంటే చీరాలలో పాత్రికేయుడు నాగార్జునరెడ్డిపై దాడి కేసులో ఆమంచితో
పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి అధికారంలోనే ఉన్నా పార్టీ
నేతపై పోలీసులు కేసు నమోదు చేశారంటే ఆమంచి ట్రాక్ రికార్డు ఏ స్ధాయిలో ఉందో
అర్ధమైపోతోంది.
నవోదయ పార్టీ తరపున 2014లో గెలిచిన ఆమంచి టిడిపిలో చేరారు. అప్పటి నుండి ప్రత్యర్ధులపై రెచ్చిపోయారు. ఆమంచి దాష్టీకాలను భరించలేక టిడిపిలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. దాంతో మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపికి రాజీనామా చేసిన ఆమంచి వైసిపిలో చేరారు. టిడిపిలో ఉన్నంత కాలం వైసిపి నేతలపై చాలా కేసులే పెట్టించారు.
అందుకనే ఆమంచి వైసిపిలో చేరాలని అనుకున్నపుడు నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అయినా ఆమంచిని వైసిపిలో చేర్చుకున్నారు. విజయసాయిరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు జగన్ పై ఒత్తడి పెట్టి మరీ పార్టీలోకి చేర్పించుకున్నారని ఆరోపణలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ ప్రభంజనం కనిపించినా చీరాలలో వైసిపి అభ్యర్ధిగా పోటి చేసిన ఆమంచి ఓడిపోయారంటే ఈయనపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది.
అటువంటి ఆమంచి వైసిపి గెలవగానే అధికారపార్టీ నేతగా మళ్ళీ జూలు విధిలించటం మొదలుపెట్టారు. టిడిపిలో ఉన్నపుడు వైసిపి నేతలపై కేసులు పెట్టించిన ఆమంచి వైసిపిలో చేరగానే టిడిపి నేతలపై కేసులు పెట్టిస్తున్నారంటూ గోల మొదలైంది. ఇందులో భాగంగానే నాగార్జున రెడ్డిపై రెండు రోజుల క్రితం మళ్ళీ దాడిచేయించి చచ్చేట్టు కొట్టించాడు.
ఎప్పుడైతే ఘటన బయటపడిందో పార్టీలకు అతీతంగా, జనాల్లో ఆమంచిపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. పనిలో పనిగా ఆమంచి మీదున్న వ్యతిరేకత అంతా జనాలు జగన్మోహన్ రెడ్డి మీద కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఆమంచి విషయంలో జగన్ ఏదో ఓ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం తప్పేట్లు లేదు.