అమెరికా ఉన్నతాధికారి ఒకరు పాకిస్తాన్ ప్రదర్శించే ద్వంద్వ నీతిని వేలేత్తి చూపించారు. చైనాలో ఉయిఘర్స్ ను కలుపుకొని టర్కీ భాష మాట్లాడే మైనారిటీ ముస్లింలు — చైనాలో ఆదేశం విధించిన నిర్భంధం గురించిన అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించక పోవటాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ ప్రశ్నించగా - ఇమ్రాన్ సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్నను దాటనేశారు.
దరిమిలా ఆమె భారత్ తో శాంతి చర్చలు కోరుకుంటున్న విషయం నిజమే అయితే అందుకు తగ్గట్టుగా ముందుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి ఎందుకు చేయటం లేదని, కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వంపై విమర్శలు విసురుతున్న పాకిస్తాన్ తొలుత ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అమెరికా సూచించింది.
ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 74 వ సెషన్ లో భాగంగా అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ మీడియా తో మాట్లాడుతూ "కశ్మీర్ విషయంలో దాయాది దేశాల సామరస్య పూర్వక చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ ఇరువురు చర్చల ద్వారానే ఈ సమస్యకు ముగింపు ఇవ్వాలని" అదే జరిగితే ఇరు దేశాలకు బాగుంటుందన్నారు.
కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని కోరబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ మాత్రం కశ్మీర్ అంశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే పాకిస్తాన్ తొలుత "ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్" ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఐక్య రాజ్యసమితిచే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడిన లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ వంటి వాళ్లకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించకుండా ఉండాలి. అపుడే పరిస్థితులు చక్కబడతాయి - అని అలైస్ వెల్స్ పేర్కొన్నారు.
అదే విధంగా కశ్మీర్ లోని ముస్లింల విషయంలో ఒక విధంగా, చైనాలోని ముస్లింల విషయంలో మరో విధంగా వ్యవహరించడం లోని ఔచిత్యమేమిటని ఆమె పాకిస్తాన్ ను సూటిగా ప్రశ్నించారు. ‘కశ్మీర్ కంటే చైనాలోని ముస్లింలే కఠిన నిర్భంధంలో ప్రత్యేక శిబిరాల్లో, భీతితో వణుకుతూ క్షణమొక యుగంలా జీవిస్తున్నారని అంటూ, పాకిస్తాన్ వాళ్ల గురించి ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అలైస్ వెల్స్ వ్యాఖ్యానించారు.
China Uighur Muslims in concentration camps — One million held in political camps, UN told