ఇంట్లో పెంచుకునే కుక్కలకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయిస్తుండాలి. లేదంటే వాటి వలన ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వర్షాకాలంలో కుక్కల్లో ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ అధికంగా ఉంటుంది. ఈ సమయంలోనే అవి ఎక్కువగా కరుస్తుంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండేందుకు చూస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కుక్కలు కరిచినపుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరిచిన ప్రాంతాన్ని సబ్బుతో 15 నిమిషాలపాటు శుభ్రంగా క్లీన్ చేయాలి. అనంతరం హాస్పిటల్ కు వెళ్లి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేయడం వలన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఏమి కాదులే అని వదిలేస్తే దానివలన వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఇక ఈ ర్యాబిస్ వ్యాధిని ఇప్పుడు కాదు.. ఎప్పుడో గుర్తించారు. 16వ శతాబ్ధంలో ఇటలీలో ప్రాణాంతక వ్యాధి అయిన ర్యాబిస్ను కనుగొన్నారు. ఈ వ్యాధి సోకకుండా 1885లో బయాలజిస్ట్ డాక్టర్ లూయిస్ పాస్టర్ వ్యాక్సిన్ను కనుగొన్నారు. ర్యాబిస్ వ్యాధి సోకిన మొదట రోగి జోసఫ్ మెయిస్టర్గా నిర్ధారించారు. ఇంట్లో పెంచుకునే కుక్కల్లో కంటే వీధి కుక్కల నుంచే ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోవడం వలనే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయని వైద్య అధికారులు పేర్కొంటున్నారు. వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటి వరకు కాకినాడ హాస్పిటల్ లో ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. వ్యాధి సంక్రమించిన వెంటనే రోగి కంగారుగా ఉంటాడు. ప్రతి విషయానికి భయాందోళనకు గురౌతుంటాడు. నీళ్లను చూస్తూ తీవ్రంగా భయపడతాడు. ఫ్యాన్ గాలి పడకపోవడం, నోట్లో నుంచి సొంగ కారడం, అలజడిగా ఉండడం, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకొని బయటపడాలని వైద్యులు సూచిస్తున్నారు.