ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అక్రమాలను నిరూపించేందుకు జగన్ ప్రభుత్వం తహతహలాడుతోంది. చంద్రబాబు అవినీతి, అక్రమాలను జనం ముందు పెట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈపాటికే ఆయన అనేక విచారణలకు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం టెండర్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో వందల కోట్లు బొక్కేశారని వైసీపీ అంటోంది. కానీ చంద్రబాబు మాత్రం జగన్ పైనే ఎదురు దాడి చేస్తున్నారు.
అయితే చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా జరిగిన అక్రమాలకు శిక్ష అనుభవించక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై టీడీపీ ప్రభుత్వం అవలంభించిన విధానాలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల ప్రజలపై 30శాతం అదనపు భారం పడింది అన్నారు.. పీపీఏలను సమీక్షించమని హైకోర్టు ఆదేశించింది. సీఎం జగన్ నేతృత్వంలో నిష్పక్షపాతంగా పాలన సాగిస్తూ, గత పాలకుల అక్రమాలను వెలుగులోకి తెస్తుంటే, చంద్రబాబు ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని కాకాణి అంటున్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడింది. జీయూవిఎన్ఎల్ సంస్థ నుంచి గుజరాత్ ప్రభుత్వం యూనిట్ను రూ. 2.43కు కొనుగోలు చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలమైన మూడు కంపెనీల నుంచి యూనిట్ రూ. 4.84కు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ మిగులు ఉన్నా.. సంప్రదాయేతర ఇంధనం పేరుతో అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేశారు. చంద్రబాబు ఎంత రాద్ధాంతం చేసినా జరిగిన అక్రమాలకు శిక్ష అనుభవించక తప్పదంటున్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి.