తెలంగాణ ప్రభుత్వం రైతులకు షాక్ ఇచ్చింది. ప్రైవేటు కంపెనీల తరహాలోనే...ప్రభుత్వమే...మాయ చేసేసింది. ప్రైవేటు విత్తనాలు పండుతాయో లేదో అనే అనుమానంతో ప్రభుత్వం ఇచ్చిన జ్జొన్న విత్తనాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పరిస్థితిని చూసి లబోదిబోమంటున్నారు. పాత రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాలో తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ ద్వారా ఆరుతడి పంటలకు సంబంధించి పలురకాలు వేసిన రైతులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ సారి వర్షాలు ఆలస్యంగా పడడంతో ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ రైతలకు సూచించిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ ద్వారా ఆరుతడి పంటలకు సంబంధించి పలురకాలు సీడ్స్ సబ్సిడీపై సరఫరా చేశారు. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మిల్లెట్స్ రీసర్చ్(ఐఐఎమ్మార్) డెవలప్ చేసిన ఎన్-–15 పజ్జొన్న సీడ్ అందించారు. 90 శాతం సబ్సిడీతో రూ.47కు మూడు కిలోల సీడ్ బ్యాగ్ ఇవ్వడంతోపాటు ఐఐఎమ్మార్ డెవలప్ చేసిందని… మేలురకమైనవని ప్రచారం చేయడంతో ఎక్కువమంది రైతులు సీడ్ తీసుకున్నారు. మిగతా రకాలకంటే కూడా ఎన్-15 రకం చేను ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు.
ఉత్పత్తి కోసం ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు చేశారని సమాచారం. అయితే, 65 రోజులు గడిచినా కంకిపెట్టకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. 90 రోజులు దాటినా ఒక్క మొక్క కూడా కంకి వేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయామని గ్రహించారు. ఈ విషయాన్ని ఆఫీసర్లకు విన్నవించారు. వారు ఐఐఎమ్మార్ శాస్త్రవేత్తలకు తెలుపగా వారు వచ్చి పంటలు పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన సీడ్ వల్లే నష్టం జరగడంతో రైతులకు ఏం చేయాలతో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. అలాగే విత్తనం విక్రయించినప్పుడు వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని రైతులు అంటున్నారు. తమను ఆదుకోవాలని అగ్రికల్చర్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు.