హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేసేందుకుగాను గ్రేటర్ హైదరాబాద్ లో గత రెండు నెలలుగా 142 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను జిహెచ్ఎంసి సేకరించింది. నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఉద్యమ రూపంలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు స్థాయిలో 142 మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను జిహెచ్ఎంసి సేకరించింది. దీంతో పాటు గాంధీ జయంతి సందర్భంగా మరోసారి ప్రారంభించిన ప్లాగింగ్ కార్యక్రమంలో గత రెండు రోజుల్లో 1850 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను జిహెచ్ఎంసి సేకరించింది. గ్రేటర్ హైదరాబాద్ లోని జిహెచ్ఎంసికి చెందిన 18వేలకు పైగా పారిశుధ్య కార్మికులు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేపట్టిన ఈ ప్లాగింగ్ లో 1850 కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.



గత రెండు రోజులుగా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏసిసి సిమెంట్ కంపెనీకి పంపగా గతంలో సేకరించిన 142 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఐటిసి సంస్థకు కిలో రూ.2 చొప్పున జిహెచ్ఎంసి విక్రయించింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివిగల ప్లాస్టిక్ కవర్ల పూర్తి నిషేదం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఇచ్చిన పిలుపుమేరకు హైద‌రాబాద్ న‌గ‌రంలో పెద్ద ఎత్తున చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను జిహెచ్ఎంసి నిర్వహిస్తోంది. ఇప్పటికే  గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని 7,659 ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లి విద్యార్థుల‌కు ప్లాస్టిక్ నిషేదంపై చైత‌న్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సందర్భంగా ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్ బాటిళ్లు, స్ట్రాలు, డిస్పోస‌బుల్ వ‌స్తువుల వాడ‌కాన్ని పూర్తిగా నిషేదించి స్వ‌చ్ఛ విద్యార్థిగా ఉంటాన‌ని తెలుపుతూ విద్యార్థీనివిద్యార్థుల నుండి సంత‌కాల సేకరించారు.




ప్లాస్టిక్ క‌వ‌ర్లు, క్యారీబ్యాగ్‌ల‌ను పూర్తిగా నిషేదించి వాటి స్థానంలో క్లాత్‌, జూట్ బ్యాగ్‌ల‌ను ఉప‌యోగించేలా అన్ని రైతు బ‌జార్లు, వీక్లి మార్కెట్ల‌లో ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలను జిహెచ్ఎంసి నిర్వహిస్తోంది.  జీహెచ్ఎంసీకి చెందిన అన్ని జోన‌ల్‌, స‌ర్కిల్ కార్యాల‌యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్ బాటిళ్లు, స్ట్రాలు, డిస్పోస‌బుల్ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్‌లు, క‌ప్పులను పూర్తిగా నిషేదించి కార్యాల‌యాల‌ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌లుగా ప్ర‌క‌టించాల‌ని కూడా జిహెచ్ఎంసి కమిషనర్ గతంలోనే ఆదేశాలు జారీచేశారు.  హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ న‌గరంగా రూపొందించేందుకు కృషిచేస్తామ‌ని కోరుతూ న‌గ‌రంలో ఉన్న 45వేల స్వ‌యం స‌హాయ‌క‌ బృందాల మ‌హిళ‌ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేస్తున్నారు. వీటితో పాటు  న‌గ‌ర‌వాసుల ఉప‌యోగ‌నిమిత్తం ప్లాస్టిక్ క‌వ‌ర్ల స్థానంలో క్లాత్‌, జూట్ బ్యాగ్‌ల తయారీ యూనిట్ల‌ను స్వ‌యం స‌హాయ‌క బృందాల‌చే ఏర్పాటు చేయ‌డానికి తగు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: