పోలీసుల్ని పెట్టి మరీ గాంధీ
జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి అంటూ ఏపీ సర్కారును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఏలూరులో శుక్రవారం వైఎస్ఆర్ వాహన
మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఈ ప్రభుత్వం గాంధీ
జయంతి నాడు మద్యం దుకాణాలను తెరిచిందని చంద్రబాబు అభాండాలు వేస్తున్నారు. గాంధీ
జయంతి నాడు మద్యం షాపులు ఎక్కడైనా తెరిచామా?’ అని
జగన్ ప్రశ్నించారు.
40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు ఇలా అబద్ధాలు ఆడటం సబబేనా? అని సీఎం జగన్ నిలదీశారు. ఇలాంటి రాజకీయాల మధ్య మీ ముఖాలను చూసినప్పుడు సంతృప్తి కలుగుతుందని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి
జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలా మంచి జరుగుతుంటే అభినందించలేక ... చంద్రబాబు అబాండాలు వేస్తున్న విషయాన్ని జనం గమనిస్తున్నారని
జగన్ తెలిపారు.
గాంధీ
జయంతి రోజున నూతన మద్యం పాలసీని తీసుకొచ్చామన్న సీఎం.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊళ్లో నీళ్లు దొరక్కపోయినా.. బెల్ట్ షాపు కచ్చితంగా కనిపించేదన్నారు.తాము అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్టు షాపులను నిషేధించి మద్యం షాపులను 20 శాతం తగ్గించామన్నారు. అంతే కాదు మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూమ్ లేకుండా చేశామన్నారు. మంచి చేయడానికి తాము తాపత్రయ పడుతుంటే.. చంద్రబాబు విమర్శిస్తున్నారని
జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ
జయంతి రోజున గ్రామ సచివాలయాలను ప్రారంభించామన్న
జగన్ రెండు వేల జనాభా ఉన్న ప్రతి చోట ఒక గ్రామ సచివాలయం అందుబాటులోకి తెచ్చామన్నారు. అంటే ప్రతి ఊరికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇచ్చి గాంధీ
జయంతి రోజున గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి నాంది పలికామన్నారు.