ఆసక్తికరంగా మారిన మహారాష్ట్ర ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో శుక్రవారం అధికార బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన, ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్,
మంత్రి ఏక్నాథ్ షిండే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.
మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీ-శివసేనలకు ఒప్పందం కుదిరింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 150 సీట్లు బీజేపీకి, 124 సీట్లు శివసేనకు దక్కాయి. మిగిలిన 14 సీట్లను చిన్న భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ సంయుక్త మీడియా సమావేశంలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వివరాల్ని వెల్లడించారు. బీజేపీ, శివసేన, ఇతర పార్టీలతో ఏర్పడిన ‘మహాయుతి (మహాకూటమి)’ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తంచేశారు.
కాగా, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తొలిసారి బీజేపీ నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఫడ్నవీస్.. నాగ్ఫూర్ సౌత్వెస్ట్ స్థానం నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర
మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆయన వెంట ఉన్నారు. ఫడ్నవీస్పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశీష్ దేశ్ముఖ్ తలపడనున్నారు. బీజేపీ, శివసేన, ఆర్పీఐ (ఏ), ఇతర పార్టీలతో కూడిన మహాయుతి విజయంసాధిస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తంచేశారు. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీకి 21న పోలింగ్ జరుగనుండగా, ఈ నెల 24న ఫలితాలు వెలువడతాయి.ఆర్థిక రాజధాని ముంబైలో అన్ని పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థితిలో తెలుగు ఓటర్లు ఉండటం గమనార్హం.