తెలంగాణ సీఎం కేసీఆర్.. తీరుపై మరోసారి విజయశాంతి అసహనం వ్యక్తపరిచారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న... ఒడ్డు దిగినాక బోడి మల్లన్న’ అనే తీరుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. అదే అతని సహజ స్వభావమని విజయశాంతి వాపోయారు. తెలంగాణ సీఎం నిరంకుశ ధోరణితో రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి.

"తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను కెసిఆర్ గారు కనీసం పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టేశారు.., తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాలను సీఎం గాలికి వదిలేశారు.., తన మాటే నెగ్గాలని, ఎదురు తిరిగితే అణచివేయాలన్న ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని" మన రాములమ్మ విమర్శించారు. తమకు మద్దతుగా నిలిచిన వారిపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.

ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఆధిపత్య ధోరణి ఆయన నిజస్వరూపాన్ని తెలుపుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ కేసీఆర్ గారు కామెంట్లు చేయడం 'దొర'హంకారానికి ప్రతీకన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ గారు వార్నింగ్ ఇచ్చే ముందు.. గతంలో సకల జనుల సమ్మె సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా అతను చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.

ప్రజలకు ఏమీ చేయకపోయినా కూడా వచ్చే 10 ఏళ్ళు తాను సీఎంగా కొనసాగుతానని ఎవరో కొందరు జ్యోతిష్కులు చెప్పిన మాటల్ని కెసిఆర్ గారు పూర్తిగా నమ్మినట్టు ఉన్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.ఎలాంటి జాతకాన్ని అయినా మార్చగలిగే శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందన్న విషయాన్ని కెసిఆర్ గారు గుర్తు పెట్టుకుంటే మంచిదని..,, దసరాను రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తాయని.. కానీ, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోలేకపోతున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితికి సిఎం గారి  మొండివైఖరే ప్రధానకారణమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: