"సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే" ఈ శక్తి కనుక లేకుంటే! శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు "అమృత వాక్కు" లో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రికి ప్రతి రూపం అని, పరమేశ్వరుడు పగలుకి ప్రతి రూపం రూపం అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే! సర్వ పాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం మనకు తెలియచెస్తోంది.
ఎందరో మహా యోగులు మునులు సిద్ధులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టియందుగల చరాచర వస్తువులన్నిటియందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగిఉంది. ఈ సృష్టి యందు జనించి నిక్షిప్తమైన, జ్యోతిర్మండల, వాయువు జలం అగ్ని ఆకాశం పృధ్వి లాంటి పంచ భూతాలు ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందురూ ఆమోదించే విషయం.
ఆ మహా మహితాత్మక శక్తినే — పరాశక్తిగాను, జగన్మాతగాను పలు పేర్లతో రూపాలతో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రి పర్వదినాలలో ఏనోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.
దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షించుటకుకొనుటకు, ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గము లేదని తలచి ఆ మహాశక్తికోసం మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండ మందు వారి శరీరభాగాలను ఖండించుకుని ఆహుతిచెయ్యగా, ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురు ని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.
ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా
1 శైలపుత్రి
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయనీ
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది. తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలలో పూజలందుకుంది. "బ్రహ్మ"కైటభుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు.
"పరమేశ్వరుడు" త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు.
"దేవేంద్రుడు" దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి
తిరిగి సంపదల్ని పొందకలిగినాడు.
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షం పాడ్యమి, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణ ఉవాచ. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు.
అందు మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను,
తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను,
చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలి.
ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు . ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితా దేవిని పూజించి ఈ శ్లోకంతో
"శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ" అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి.
ఇలా ఈ జగన్మాత మానవులను తీర్చిదిద్ది (మ=మాయ, న=లేకుండా, వ=వర్తింప చేసి) తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించుటవల్ల ఆ శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయినది అని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తంగా పరిగణిస్తారు.