ఈ మధ్య ఏ ఇల్లునో..,, వాకిలినో కాదు.. ఏకంగా కర్ణాటకలో రోడ్డు పక్కన పార్క్ చేసున్న బస్సును టార్గెట్ చేశాడో యువకుడు. సరదాగా బస్సును అలా నడుపుకుంటూ 65 కిలోమీటర్లు వెళ్లిపోయాడు. తీరా బస్సు కనిపించకపోవడంతో షాక్ తిన్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సును కనిపెట్టలేక తలలు పట్టుకున్నారు. ఇంతలో బస్సు ఎత్తుకెళ్లిన యువకుడి తండ్రి ఫోన్‌ కాల్‌తో ఆచూకీ దొరికగా..,, జరిగిన ఈ విచిత్రమైన ఘటనలోని ట్విస్ట్‌లతో పోలీసులే షాక్ తిన్నారు.

శనివారం రాత్రి ఉల్లాల్-మంగళూరు మధ్య నడిచే ప్రైవేట్ బస్సును డ్రైవర్ బస్టాండ్ సమీపంలో పార్క్ చేయగా..,, ఉదయం క్లీనర్ వచ్చి బస్సును శుభ్రం చేసేందుకు వీలుగా తాళాన్ని తన సీటు కింద పెట్టి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం క్లీనింగ్ కోసం వచ్చి బస్సు కనిపించకపోవడంతో షాక్ తిన్నాడు. వెంటనే బస్సు డ్రైవర్, యజమాని తొ సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

బస్సు కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులకు ఎటువంటి ఆచూకీ దొరకలేదు. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు తన కుమారుడు బస్సు తీసుకొని పారిపోతున్నట్లుగా ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును పట్టుకునే పనిలో పడ్డారు. యువకుడి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఉడిపిలో అదుపులోకి తీసుకొని..,, బస్సును స్వాధీనం చేసుకొని యువకుడ్ని ఉల్లాల్ తరలించారు.

బస్సు ఎత్తుకెళ్లిన యువకుడి మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అతని పేరు మహ్మద్ నిఫాజ్‌ కాగా.. ఉల్లాల్ బస్టాండ్ సమీపంలో ఉన్న సర్వీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు తేలింది. యువకుడు ఉడిపి వెళ్లే దారిలో.. బస్సును డివైడర్లకు ఢీకొట్టడంతో స్వల్పంగా ధ్వంసమయ్యింది. మొత్తానికి ఆ యువకుడు పోలీసుల్ని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: