తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఆరవ రోజుకు చేరుకున్నా,ప్రభుత్వం మాత్రం తమ పంథాలను వీడలేదు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ప్రకటన చేసిన ప్రభుత్వం ,ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టాయి. దీంతో ఆర్టీసీ కార్మిక కుటుంబాలలో ఆందోళన మొదలైంది.
దాదాపు 48600 మందిని ఉద్యోగాల నుండి తొలగించామని సాక్షాత్తు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఒక కుటుంబాన్ని భారీ విషాదంలోకి ముంచింది . తన భార్య ఉద్యోగం పోతుందన్న తీవ్ర మనస్తాపంతో ఆమె భర్త గుండెపోటుతో మరణించిన సంఘటన సంగారెడ్డి పరిధిలోని బాబానగర్ లో చోటు చేసుకుంది . కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్నె
కిశోర్ అనే వ్యక్తి ప్రైవేట్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇక తన భార్య నాగరాణి ఆర్టీసీలో చాల కాలంగా పని చేస్తోంది.
సమ్మె నేపథ్యంలో పాల్గున్న ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటన స్పష్టం చేయడంతో, ఈ విషయం పై వారి ఇరువురి మధ్యా చర్చ జరిగింది. ఉద్యోగం పోతే బ్రతకడం ఎలా అని భార్యాభర్తల మధ్య చర్చ కాస్త గొడవగా మారటం తో , ఉద్యోగం పోతే బ్రతకడం చాలా కష్టం అవుతుంది అని కిశోర్ తీవ్ర మానసిక వేదనకు గురికాగా గుండె పోటుతో మరణించారు.
రెండ్రోజులుగా సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందారు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.మృతుడికి భార్య నాగరాణితోపాటు రెండేళ్ల పాప ఉంది. తన భర్త మృతికి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కారణం అని నాగరాణి ఆరోపించారు. మొన్నటి వరుకు ఎంతో సజావుగా సాగే వారి కాపురంలో ఆర్టీసీ కార్మికుల సమ్మ చిచ్చు పెట్టాయి.భర్త మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు నాగరాణి.ఏది ఏమయినా
కిశోర్ మృతితో ఓ కార్మిక కుటుంబంలో పెను విషాదం అలముకుంది.