పేదలకు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఏప్రిల్ నెల నుంచి గ్రామ వాలంటీర్ల సాయంతో ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చెయ్యడానికి గాను ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలులో తగు జాగ్రత్తలు తీసుకొనున్నారు. ఖరీఫ్లో పండిన వరి పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిగ్గాను ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించిన పంట ప్రస్తుతం పొలాల్లో ఉండగా..,, మరో నెలరోజుల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలు కలిపి కొనేసి ఒకేచోట నిల్వ చేసి మిల్లులకు పంపించేయకుండా రకాల ఆధారంగా విభజించి మిల్లులకు పంపించి మిల్లింగు చేసేందుకు చర్యలు తీసుకొనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్న రకాలు, సాధారణ రకాల ధాన్యం వేర్వేరుగా కొనుగోలు చేయడంతోపాటు, గ్రేడ్–ఎ, సాధారణ రకాలను గుర్తిస్తారు. మంచి రకాలను రేషన్కార్డు లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. మిగతా రకం ఎఫ్సీఐ, ఇతర అవసరాలకు తరలిస్తారు.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చాలంటే స్పాన్టెక్స్ మిల్లుల్లోనే మరాడించాలి. ఇక్కడ మిల్లింగ్ చేయడం వల్ల నూకలు తక్కువగా ఉండటమే గాకుండా సన్నరకం బియ్యం సిద్ధమవుతాయి. ఈ బియ్యం తినడానికి అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో ఆ స్థాయిలో స్పాన్టెక్స్ మిల్లులకు సైతం తగు ఏర్పాట్లను చేయనున్నారు. దీనిపై జిల్లా అధికారులు శుక్రవారమే చర్చించారు. బియ్యాన్ని అందంగా ప్యాక్ చేసేందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పుకునేవారికోసం ప్రత్యేకంగా ఈ నెల 16వ తేదీన జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో దీనికి సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తారు. మొత్తమ్మీద జిల్లా యంత్రాంగం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.