జీవితంలో ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టామంటే ఆ ప్రయాణం చేసే వ్యక్తి జాగ్రత్తగా ఉంటే సరిపోదు. అతను ప్రయాణించే చోటుతో పాటు, అతని వెంట ఉన్నవారు కూడా సరిగ్గా వుండాలి. అప్పుడే ఆ ప్రయాణం విజయవంతంగా ముగుస్తుంది. ఇక జగన్ ఏపి సీయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో అతని శాఖలో ఉన్న ప్రతి నాయకుడు సమర్ధవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సహకరిస్తుంటే వీరి పాలన అనే ప్రయాణం విజయతీరాలను చేరి ప్రజల మన్ననలను పొందుతుంది. కాని అందరు ఒకే తీరుగా ఉండాలనే రూల్ ఉండదుగా, అందుకే కొందరిలో దూకుడు ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి వ్యక్తే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్.. ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ వ్యూహాలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలోనూ, ఆయన వాయిస్ను బలంగా వినిపించడం లోనూ, ప్రతిపక్షంపై మాటల తూటాలు పేల్చడంలో, కౌంటర్లు ఇవ్వడంలోనూ అనిల్ది ప్రత్యేక స్టైల్..ఇక, మరో మంత్రి. అవంతి శ్రీనివాస్ వ్యవహారంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో విపక్షంపై విరుచుకుపడుతున్న ఆయన జగన్ దృష్టిలో పడాలనే ఆతృతలో నేరుగా మాజీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. దీంతో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
వైఎస్ ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో మంత్రి అవంతి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఇకపోతే ఏపీలో ఈ ఇద్దరు మంత్రులు కొంత దూకుడు ప్రదర్శిస్తుండడంతో ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయని సీనియర్ మంత్రులు చెవులు కొరుక్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మంత్రుల వ్యవహార శైలిపై పార్టీలోనూ అంతర్గతంగా చర్చ నడుస్తోందట. ఇకపోతే ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన పనేంటంటే, రాష్ట్రంలో కనీసం 30 ఏళ్ల పాటు అధికారాన్ని తన వద్దే ఉంచుకుంటానని జగన్ అనేక సభల్లోనూ చెప్పారు. కాని అనిల్ మాత్రం మేం 20 ఏళ్లు అధికారంలో ఉంటాం.. అంటూ కృష్ణాజిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పూజా కార్యక్రమంలో ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు.
అంతేగాక ఆయన శాఖతో సంబంధంలేని విషయాల్లో, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రకటనలు చేస్తుండటం కూడా మిగిలిన మంత్రులకు, ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది. అదీగాక మరోనేత అవంతి శ్రీనివాస్ కూడా ఇలానే నోరుజారాడు.అదేంటంటే సీఎం జగన్ ఫొటోలు.. మీ ఆటోలకు వెనకాల అంటించుకోండి.. పోలీసులు కానీ, ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ మీకు కేసులు రాయదు, వారివల్ల వేధింపులు కూడా ఉండవు. అని కామెంట్ చేశారట. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇలా ఇద్దరు మంత్రులు తమ ప్రవర్తనతో ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా వ్యవహరించడంపై సీనియర్ మంత్రులతో పాటు సీయం కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం..