వైకాపా గంజాయి వనంలో తాను తులసి మొక్క అనే అపోహలో అవంతి శ్రీనివాస్‌ మునిగి తేలుతున్నారు. మోసం, దగా, వంచనకు మారుపేరు అవంతి శ్రీనివాస్‌ అని మంతెన సత్యన్నారాయణ పేర్కొన్నారు.  పాలనను గాలికొదిలేసి గాఢ నిద్రలో ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కంట్లో పడేందుకు అడ్డమైన డ్రామాలాన్నీ ఆడుతున్నారు. మంత్రి పదవిని చేపట్టిన 4 నెలల కాలంలో విశాఖ జిల్లాకు కనీసం ఏం చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఉన్నారు. ఇప్పుడు కూడా తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుగారిపై నోరుపారేసుకుంటున్నారని మంతెన పేర్కొన్నారు. 


విశాఖలో చంద్రబాబునాయుడుగారి పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి అవంతి శ్రీనివాస్‌కు మైండ్‌ బ్లాక్‌ అయింది. మంత్రి పదవి పోతుందనే ఫోబియాతో అవంతి శ్రీనివాస్‌కు నిద్ర కూడా కరువైంది. అందుకే కళ్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారు. కానీ విమర్శలకు దిగే ముందు.. మీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబునాయుడు గారేనని గుర్తుంచుకోండి. వందమంది అవంతి శ్రీనివాస్‌లు, వెయ్యి మంది జగన్‌లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని మంతెన ధీమా వ్యక్తం చేశారు. 


37 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో ప్రజా బలంతో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. గోదావరిలో మునిగిన పడవను 30 రోజులైనా బయటికి తీయడం చేతకాని నేతలకు మాట్లాడే అర్హత లేదు. స్మశానాలకు, పాఠశాలలకు వైకాపా రంగులు వేయటంపై ఉన్న శ్రద్ధ మీకు ప్రజా సంక్షేమంపై లేదు. వశిష్ట బోటుకు అనుమతిచ్చి..  50మందికిపైగా ప్రాణాలను బలిగొన్న అవంతి శ్రీనివాస్‌ వశిష్టాసురుడిగా పేరు పొందారు. టైటానిక్‌ మునిగి 100 ఏళ్లయినా బయటకి తీయలేదు. చూస్తుంటే వశిష్ట బోటును కూడా మీరు మరో టైటానిక్‌లా చేసేలా ఉన్నారు. ఆటోల వెనుక జగన్‌ ఫోటో పెట్టుకుంటే పోలీసులు ఆపరని మీ మాటలు విన్న ఆటోడ్రైవర్లంతా.. నేడు బాడుగలు రాక బాధపడుతున్నారు. చేతనైతే వ్యవస్థలను కాపాడి.. ప్రజలను ఆదుకోండి. అంతేగానీ చిల్లర రాజకీయాలతో ప్రయోజనం పొందుతామనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వమే అవుతుందని మంతెన ఈ సందర్భంగా పేర్కొన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: