ముఖ్యమంత్రిగా 'వై ఎస్ జగన్' తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మొదట్లో జగన్ దూకుడు చూసి కొత్తలో అలాగే ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన చూస్తుంటే.. ముచ్చట వేస్తోంది. మొత్తానికి తాను ఇచ్చిన నవ రత్నాలు హామీలను నెరవేర్చేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు జగన్ దూసుకొనిపోతున్నాడు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. జగన్ వేగం చూస్తుంటే టీడీపీ వాళ్ళకి ఏం చేయాలో అర్ధం కావట్లేదట. అందుకే జగన్ ప్రభంజనంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి బాబు నానా హంగామా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఓ వైపు హింసా రాజకీయాలకు పాల్పడుతూనే వైయస్ఆర్ సీపీ పై బురదజల్లుతోందని వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైగా గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని కూడా వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. ఇది కాదనలేని నిజమే.
ఏమైనా రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుంది. ఇక గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందట. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు జగన్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని చెబుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇవ్వన్నీ చూస్తే.. జగన్ మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన నవ రత్నాల హామీల పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల మీద ఫోకస్ పెట్టాడు జగన్. అందులో భాగంగా మొదట గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అది ఏర్పడిన తర్వాత తమ పధకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా చేయటానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే నవరత్నాల హామీను ఆచరణలో పెట్టబోతున్న జగన్.. ఇంకా అదనపు హామీల కోసం కూడా అహర్నిశలు శ్రమిస్తున్నాడు.