కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌ నగర్‌లో అసెంబ్లీ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్సే దక్కించుకునేలా చేస్తానని బల్లగుద్ది చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడి నుంచీ ఎమ్మెల్యేగా గెలిచి... తర్వాత ఎంపీ అయిన ఉత్తమ్... ఇప్పుడు ఇదే స్థానంలో తన భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో దింపి..

. ఉద్ధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె గెలుపు బాధ్యత తనదే అని ప్రకటించిన ఉత్తమ్... ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని... భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు ఇలా కాంగ్రెస్ కీలక నేతలను ప్రచార బరిలో దింపుతున్నారు. అలాగే... 18, 19 తేదీల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయబోతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా చివర్లో రెండ్రోజులు ప్రచారం చేస్తారని తెలిసింది. ఇలా.. పద్మావతి రెడ్డి గెలుపు కోసం ఉత్తమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.


ఐతే... టీ-పీసీసీగా ఉత్తమ్ సారధ్యంలో జరిగే చివరి ఎన్నిక ఇదే అనే ప్రచారం సాగుతోంది. ఇందులో సత్తా చాటితేనే ఆయన్ని టీ-పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారనీ లేదంటే పదవి నుంచీ తొలగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన పదవీ కాలం ఆల్రెడీ పూర్తి కావస్తోందనీ, అందువల్ల సహజంగానే తనను తప్పించి వేరేవారికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకూ, తన పదవికీ సంబంధం లేదని అంటున్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందంటున్న ఆయన... కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం మొత్తం బాధ్యత తనదే అంటున్నారు.ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. అందువల్ల 19 సాయంత్రం వరకూ పార్టీలు ప్రచారం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: