దేశంలో జరుగుతున్న ఆవినీతి, అక్రమాల వల్ల ఎన్నో ప్రాణాలు అనంతలోకాలకు వెళ్లుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన పీఎంసీ బ్యాంక్ కేసులో కస్టమర్ల గుండెలు ఆగుతున్నాయి. కష్టార్జితాన్ని బ్యాంక్లో దాచితే కష్టకాలంలో తమకు, తమను నమ్ముకున్నవారికి ఆసరాగా ఉంటుందనుకున్న డిపాజిటర్లకు కుంభకోణం వ్యవహారంతో గుండెలు పగులుతున్నాయి. సోమవారం ఇద్దరు, మంగళవారం మరొకరు చనిపోగా, 24 గంటల వ్యవధిలో ముగ్గురు డిపాజిటర్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సొమ్ము కోసం రోడ్డెక్కిన బాధితులు.. భవిష్యత్పై ఆందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సోమవారం ఓ జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగి, ఓ డాక్టర్ కన్నుమూసిన నేపథ్యంలో మంగళవారం మరో చావును చూడాల్సి వచ్చింది. ముంబైలోని ఓషీవారా నివాసి అయిన 51 ఏండ్ల సంజయ్ గులాటీ.. పీఎంసీ బ్యాంక్లో రూ.90 లక్షలు దాచుకున్నారు. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన ఆంక్షలు సంజయ్ని తీవ్రంగా కుంగదీశాయి. ఈ క్రమంలోనే సోమవారం బాధితులంతా ఆందోళనకు దిగగా, అది ముగిసిన తర్వాత ఇంటికొచ్చి భోజనం చేస్తున్న సంజయ్ గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఇంతటితో ఆగుతాయనుకున్న మరణాలు, ఆగిపోకుండా మరొకరిని బలితీసుకుంది. సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్లో ఖాతాకలిగిన ముంబైకి చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితురాలిని డాక్టర్ నివేదితా బిజ్లాని (39)గా గుర్తించారు. పీఎంసీ డిపాజిటర్ సంజయ్ గులాటీ ఆత్మహత్యకు పాల్పడిన రోజే ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి బాధితులకు న్యాయం జరిగేవరకు ఇంకెన్ని గుండెలు ఆగిపోతాయో, మరెన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో అని ఆందోళన చేస్తున్నారు.
ఇకపోతే 4355 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగుచూసిన పీఎంసీ బ్యాంక్కు సంబంధించి ఖాతాదారుల లావాదేవీల పైనా ఆర్బీఐ పలు నియంత్రణలు విధించడంతో డిపాజిటర్లు తమ సొమ్ము వెనక్కుతీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అంతేకాకుండా పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వల్ల డిపాజిటర్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.