రావ్-సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు -
మన్మోహన్ సింగ్ రఘురాం రాజన్ హయాం - అంటూ ఇలాంటి విషయాలపై తన భర్త పరకాల
ప్రభాకర్ 'ది హిందూ' పత్రికలో రాసిన సంపాదకీయ వ్యాసంపై ఉవ్వెత్తున అపరకాళిలా విరుచుకు పడ్దారు భారత ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్. పాపం! ఎదో రాసి ఎరక్కపోయి ఇరుకున పడ్డారులా ఉంది ఆమె భర్త పరకాల ప్రభాకర్.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను అత్యంత క్షీణదశను చూశాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
అమెరికాలోని విశిష్ట 'కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్' లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘భారత ఆర్థిక వ్యవస్థ – పలు సవాళ్లు, అనేక అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు.
యూపీఏ–2 పాలన ఉటంకిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అటు భర్త
ప్రభాకర్ కు ఇటు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కు ఘాటుగా సమాధానం చెప్పారు. 2012 ఆగస్ట్ 10 నుంచి 2013 లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్గా , రఘురామ్ రాజన్ పనిచేశారు..
"ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం, గత కొంత కాలం క్రితం ఎలా ఉందో ఆర్థికవేత్తలు పరిశీలించవచ్చు. భారత బ్యాంకుల గురించి మాట్లాడుతున్న రఘురాం రాజన్ తన హయాంనాటి గడ్డు పరిస్థితులకు ముందు సమాధానాలు చెప్పాలి. ప్రస్తుతం బ్యాంకులకు పునరుజ్జీవం కల్పించడమే ఆర్థికమంత్రిగా తన ప్రధాన కర్తవ్యం అంటూ, పునరుజ్జీవం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి రాత్రికి రాత్రి ఏర్పడలేదు కదా!" అని ఆమె ప్రశ్నించారు.
‘‘ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన "ఫోన్ కాల్స్తో ఋణాలు మంజూరు" చేశారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నుండి శ్లెష్మంలోబడ్డ ఈగలా కొట్టుకుంటూ బయటపడలేక నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన మన్మోహన్ సింగ్ నాయకత్వం కారణంగా భారీ స్థాయి అవినీతి చోటు చేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ముఖ్యంగా ఆర్ధిక రంగంపై పట్టు కాని నియంత్రణ కాని — లేని ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు.
రఘురాం రాజన్ను తాను ఎగతాళి చేయడం లేదని, ఆర్ధిక శాస్త్ర విఙ్జానవేత్తైన ఆయన్ను గౌరవిస్తానని అంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్థుల నాణ్యతను సమీక్షించి నందుకు రఘురాం రాజన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు ₹ 70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు ₹ 8,06,412 కోట్లు కాగా గత మార్చి నాటికి ఉన్న₹ 8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. రఘురాం రాజన్ హయాం లోనే పీఎస్బిల మొండి బకాయిల సమస్య తీవ్రత సంతరించుకుందని, ఆ సమస్య నుంచి గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసు కుంటుందని అన్నారు.
*ప్రభుత్వ బ్యాంకులకు మూలధన అవసరాల కోసం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ₹ 70 వేల కోట్ల ముందుగా కేటాయింపులు జరిపింది.
*అలాగే 10 బ్యాంకుల విలీనం ద్వారా 4 బడా బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది..
ఈ మధ్య బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ రఘురాం రాజన్ ఆర్థికాభివృద్ధి విషయంలో మొదటి విడత నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు. మోదీ ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ మితిమీరిన స్థాయిలో ఉందని, ఆర్థికాభివృద్ధి సాధనలో ప్రభుత్వానికి స్థిరమైన, స్పష్టమైన దృష్టి లేదన్నారు .
ఈ విధమైన వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ తిప్పికొడుతూ కాస్త ఘాటుగానే స్పందించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించ కుండానే కాస్త సెటైరిక్ గా అత్యంత ప్రజాస్వామిక నాయకత్వంలోనే అవినీతి భారీగా జరిగిందని ముక్తాయింపునిచ్చారు.
ఇటీవల సమస్యల్లో ఇరుక్కున్న విపణి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే ఒక దారికి రావచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత సెప్టెంబర్ నెలలో ఐకరాజ్య సమితి సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో ఇరు దేశాలు పరిమిత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాయి.
మొత్తం మీద ఒక ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలో రఘురాం రాజన్ మోడీని టారెట్ చేస్తే —
ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అదే దేశంలో మరో ప్రఖ్యాత యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో
అటు భర్త పరకాల ప్రభాకర్ ను ఇటు రఘురాం రాజన్ ను “
టార్గెట్ చేసి సూటిగా కొట్టారు” భారత ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్
అసలు రఘురాం రాజన్ హయాంలోనే ప్రభుత్వ బాంకులలో నిరర్ధక ఆస్థులకు బీజం పడిందంటారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు అత్యంత పలుకుబడి కలిగిన కాంగ్రెస్ నాయకుడు చాణక్యుడు లాంటి రాజకీయవేత్త ప్రముఖ న్యాయవాది అయిన నాటి కేంద్రమంత్రి పెత్తనం ఆర్బీఐపై చాలా ఎక్కువగా ఉండేదని, నాడు అనేక సందర్భాల్లో విన్నాం. "ఫోన్ కాల్ పై ఋణాలు" అనేది రఘురాం రాజన్ పాలనాకాలంలో బహుళ వ్యాప్తి లో ఉన్న విషయమే.