ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దాదాపు 80,000 యూనిట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతాయని తెలుస్తోంది. 
 
లక్షల మందికి ఉపాధిని కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకోవటానికి ఈ పథకం ప్రారంభించినట్లు తెలుస్తోంది. 10 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటు అందించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక మాంద్యం, జీఎస్టీ, నోట్ల రద్దు వలన చిన్న తరహా పరిశ్రమలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పథకం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీ షెడ్యూల్ చేస్తారని తెలుస్తోంది. 
 
రుణాల ఒత్తిడిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలను సమస్యల నుండి గట్టెక్కించటం కొరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు అందించిన రుణాలను 9 నెలలలో రీ షెడ్యూల్ చేసే విధంగా ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు హామీ ఇవ్వనుంది. 2020 మార్చి నెల 31వ తేదీ లోపు ఎంఎస్ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చే విధంగా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
రిజర్వ్ బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేసే నాటికి జీఎస్టీ రిజిస్టేషన్ కూడా పూర్తి చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ గురించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు సీఎం జగన్ ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: