ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలో అక్టోబర్19న తలపెట్టిన రాష్ట్ర బంద్కు కూడా రెవెన్యూ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఉద్యోగులంతా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి రాష్ట్రంలో అన్ని తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపాలని పిలుపునిచ్చాయి. అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మద్దతుగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చాయి. ఈ సమ్మె పేరుతొ ప్రభుత్వం పట్ల తమకున్న అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు సంసిద్ధమయ్యారు. ఈ మేరకు పిలుపు నిచినవాళ్ళల్లో డిప్యూటీ కలెక్టర్ల సంఘం- తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు.
టి.వి.ఆర్.ఒ.డబ్య్లూఏ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి.ఆర్.ఒ.ఏ రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు, టి.ఎస్.వి.ఆర్.రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. లక్ష్మినారాయణ, టి.ఆర్.ఎస్.ఏ, ప్రధాన కార్యదర్శి ఏ.బాలనర్సయ్య, టి.ఎస్.వి.ఆర్.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, టి.వి.ఆర్.ఒ.ఏ రాష్ట్ర.ప్రధాన కార్యదర్శి బి.సుధాకర్ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రేపు బంద్ నిర్వహిస్తామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీ ఉత్కంఠభరితంగా మారింది.
రంగంలోకి దిగిన పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర అశ్వత్థామను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు కూడా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ
రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా రూ.85 వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్నేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో కొట్లాడి ఆర్టీసీ కార్మికులు వారి హక్కులు సాధించుకోవాలన్నారు. అంతేగాని కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హక్కులను పోరాడి సాధించుకుందామన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరి కోసమంటూ భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపునిస్తుంది.