ఉల్లి, టమాటా.. ఈ రెండు పంటలు రైతుల పాలిట లాటరీ టిక్కెట్లుగా తయారయ్యాయి. ఆరుగాలం శ్రమంచి పంట పండించినా అమ్మే సమయం వచ్చే వరకూ సీన్ రివర్స్ అవుతోంది. ఒక్కోసారి బ్రహ్మాండమైన రేటు పలుకుతుంటే..మరోసారి కేజీ రూపాయలు కూడా రైతులకు రావడం లేదు. దీనికి తోడు మార్కెటింగ్ శాఖ అధికారుల ఆగడాలు రైతులను గుల్ల చేస్తున్నాయి.
తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్ లో ఇదే సమస్య తలెత్తింది. ధరలు పలకక రైతులు టమోడాను పశువులకు మేతగా వేశారన్న విషయం చివరకు జగన్ చెవిలో పండింది. దీంతో టమాట రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాట కొనుగోళ్లలో సమస్యలు, ధరల పతనంపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. టమాట కొనుగోళ్లలో సమస్యలపై సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు.
పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. దీని వల్ల మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమీషన్లు ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చని అధికారులు తెలిపారు. డీ రెగ్యులేట్ చేయడంపై టమాట కొనుగోలు నిలిపేశారని అధికారులు వివరించారు. పత్తికొండ మార్కెట్లో కాకుండా..బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులను ఇబ్బందులకు గురి చేశారని అధికారులు తెలిపారు. మార్కెట్లోనే టమాట అమ్ముతామని రైతులు స్పష్టం చేశారని వెల్లడించారు. ఏది ఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి టమాటల కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో పత్తికొండ మార్కెట్లో తిరిగి టమాట కొనుగోళ్లు ప్రారంభించారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన ఏజెంట్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఉదయం నుంచి 50 టన్నుల టమాటాలు కొనుగోలు చేశామని అధికారులు వెల్లడించారు. ధరలు తగ్గకుండా వేలం పాటలో మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద 5 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు. ఇప్పుడు వ్యాపారులు కూడా వచ్చి టమాటాను కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ కమిషనర్ వెల్లడించారు.