హుజూర్ నగర్ ఉప ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారం ముగించాయి. ఎలాగైనా గెలవాలని తెరాస పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ గెలవడం ద్వారా తన బలం తగ్గలేదని, పట్టు తగ్గిపోలేదని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలు తెరాస వైపు ఉన్నారని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నది తెరాస. కానీ, తెరాస వాదన ఎలా ఉన్నా.. అక్కడి ఓటర్ల రియాక్షన్ ఏంటి అన్నది 24 వ తేదీన తెలుస్తుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నది. 2009 వ సంవత్సరం నుంచి హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తున్నది. 2009 నుంచి ఉత్తమ్
కుమార్ గెలుస్తున్నారు. 2009, 2014,2018 లో జరిగిన ఎన్నికల్లో ఆయన తెరాస అభ్యర్థిపై గెలిచారు. అయితే, 2018 జరిగిన ఎన్నికల్లో పోటీ హోరాహోరిగా ఉన్నది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి పోటీ చేయలేదు. ఇదిలా ఉంటె, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి.
ఏ పార్టీకి ఏది పొత్తు లేకుండా బరిలోకి దిగాయి. సీపీఎం పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్ధికి మద్దతు ఇస్తుంటే, సిపిఐ మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెరాస పార్టీ అనుసరించిన విధానాల కారణంగా మద్దతును ఉపసంహరించుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగింది. దీని ప్రభావం కొంతమేర ఉండొచ్చు. ఇంత ఉంటుంది అని చెప్పలేకపోయినా కొంతమేర మాత్రం ప్రభావం చూపగలదు.
ఇకపోతే, బీజేపీ తరపున బిసి అభ్యర్థిని బరిలోకి దించింది. ఆయనకు అక్కడ వైద్యుడిగా మంచి పేరు ఉన్నది. అయన పేరును ప్రస్తావించడంతో గతంలో కంటే కొంతమేర ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నది. ఇది కూడా ఎన్నికల రిజల్ట్ ను ప్రభావితం చెయ్యొచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస పార్టీల మధ్య పోటాపోటీ జరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించే విధంగా ఉన్నది. కాకపోతే, మిగతా పార్టీలు చూపించే ఓటింగ్ ప్రభావం మీద వాటి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.