గత 16 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతూనే ఉన్నది. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు రోడ్లపైకి రావడం లేదు. ప్రైవేట్, ఇతర సర్వీసులతో నడిపిస్తున్నారు. కానీ, రవాణా వ్యవస్థ మాత్రం బాగా కుంగిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు. పైగా సమ్మె చేస్తున్న కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సమ్మె పెరిగింది.
ఈనెల 19 వ తేదీన తెలంగాణ బంద్ జరిగింది. ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ప్రజాసంఘాలు మద్దతు ఇచ్చాయి. ఉద్యోగ జేఏసీలు కూడా మద్దతు పలికాయి. దీంతో బంద్ విజయవంతం అయ్యింది. సమ్మెను ఉదృతం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపేంత వరకు సమ్మె విరమించేది లేదని అంటోంది.
అయితే, సమ్మె చేస్తున్న కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు కారని, వాళ్ళతో చర్చలు జరిపేది లేదని ప్రభుత్వం చెప్తున్నది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. కానీ, ఇది ఎలా ఎప్పటి వరకు కొనసాగుతుంది అన్నది మాత్రం తెలియడం లేదు. హైకోర్టు కూడా ఈ విషయంలో కలుగజేసుకొని కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించినా ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. కార్మికులతో చర్చలు ప్రసక్తే లేదని అంటోంది.
ఇక ఇదిలా ఉంటె, ఈనెల 28 వ తేదీన హైకోర్టుకు సమ్మె గురించిన నివేదికను సమర్పించాల్సి ఉన్నది. అటు జేఏసీ కూడా నివేదికను సమర్పించేందుకు సిద్ధం అవుతున్నది. ఇక ఇదిలా ఉంటె, ఈనెల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ సభకు ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేసే అవకాశం ఉన్నది. దీంతో పాటు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు నిరాహార దీక్షలకు దిగబోతున్నారు. అంతేకాదు, ఆర్టీసీ కార్మికులు
దీపావళి పండుగను చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆరోజు కూడా తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 30 వ తేదీన సుమారు 4 లక్షలమందితో సకలజనుల సమరభేరి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆర్టీసీ జేఏసీ తెలియజేసింది.