పేదవాడు ధనికుడు అనే భేదం లేకుండా అందరిని సమానంగా చూపించేది ఓటు హాక్కు మాత్రమే. ఈ ఓటు గుర్తింపులో ధనిక ఓటుకు ఎంత పవరుందో గరీబు ఓటుకు అంతే విలువ ఉంది. ఐదేళ్లపాలనను నిర్దేశించే ఓటును ప్రముఖుల్లో ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారో తెలుసుకుందాం. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆదిత్య ఠాక్రే. పోలింగ్ సందర్భంగా సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే తన తాత, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆశీర్వాదం తీసుకున్నారు..
ఇక భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తాలు ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఇదేగాకుండా జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్లో పోలింగ్ బూత్కు చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణ్దీప్ సుర్జేవాలా, ఆయన భార్య హరియాణాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రణ్దీప్ కైతాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే.
వీరితోపాటుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ గడ్కరీలు నాగ్పూర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకే బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు... ఇక హర్యానాలోని అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న టిక్టాక్ స్టార్గా గుర్తింపు పొందిన సోనాలీ ఫోగట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 5.29 శాతం, హరియాణాలో 6.07 శాతం పోలింగ్ నమోదైంది...