ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో అన్నిరాజకీయ పార్టీలు మరిచిపోయాయట.. ఐదు నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షం అయ్యారు.. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షం అయ్యారు. కానీ ప్రత్యేక హోదా పై ఆనాడు రెండు పక్షాలు ఎవరికి తోచిన విధంగా వారు పోరాటం చేశారట.. కానీ ఎన్నికలు పూర్తి కాగానే ఆ ఆంశాన్ని అటకెక్కించారని ప్రత్యేక హోదాపై మరోసారి వ్యాఖ్యానించారు ఏపీ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.
ఆయన విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మరోమారు ఆయన స్పందించారు. ఆయన మాటల్లోనే ప్రత్యేక హోదాపై ఏమన్నారో చూద్దాం. ఎన్నికలు ముగిసిన దాదాపు 5 నెలలు కావస్తోంది. అటు ప్రతిపక్షంగానీ.. ఇటు అధికార పక్షంగానీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదాపై అప్పట్లో ఊదరగొట్టిన ఓ సినీ నటుడైతే ఇటు పత్తా లేకుండా పోయారట.. ముఖ్య మంత్రి, ప్రతి పక్ష నాయకులు ఎందుకు విభజన హామీలు కోసం పోరాటం చేయడం లేదని, కేంద్రం పై విరోధం పెట్టుకోమని చెప్పడంలేదని ఆయన చెప్పారు.
అలాగే హామీలు అమలు కాకపోతే రూపాయి కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రావన్న అంశాన్ని రాజకీయ నేతలు గుర్తించాలని, ఆంధ్రాబ్యాంకు లేకుండా చేస్తున్న కేంద్రంపై ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మిగతా రాష్ట్రాల తరహాలో జెఈఈ పరీక్షలు తెలుగులో కూడా రాసే అవకాశమివ్వాలని, ఈ అంశాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు గట్టి స్వరంతో వినిపించాలని ఆయన అన్నారు.
ఏదేమైనా ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఈ యేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారిపోయింది. మరి
వైసీపీ అధినేత సైతం ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయించారు. కొద్ది రోజులుగా సైలెంట్ అయిన ఇదే అంశాన్ని ఇప్పుడు మళ్లీ చలసాని తెరమీదకు తీసుకు వచ్చి ఎంత వరకు పోరాటం చేస్తారో ? చూడాలి.