ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు . ప్రగతిభవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో దాదాపు ఐదు గంటలపాటు జరిపిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ గతం లో చేసిన ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పకనే చెప్పారు .
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ఆయన , ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేదని కుండబద్దలు కొట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే . అయితే సమ్మెకు వెళ్లిన కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని గతంలో కేసీఆర్ ప్రకటించారు . దాదాపు 48 వేల మంది కార్మికులు తమంతట తామే విధుల్లో నుంచి వైదొలిగారని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మిక సంఘాలే కారణమన్న కేసీఆర్ , ఆర్టీసీ లో యూనియన్లు లేకపోతే లాభాల బాట పడుతుందని అధికారులతో చెప్పారు.
నష్టాల్లో ఉన్న సంస్థ లో ఉద్యోగుల జీతాలు పెంచమని ఎవరు చెప్పారని , ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిని , నష్టాలను కోర్టు ముందు పెట్టాలని సూచించారు . గతం ఆల్విన్ సంస్థ లాకౌట్ అయితే ఎవరు మాత్రం ఏం చేశారన్న అయన , ఆర్టీసీ మరో ఆల్విన్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు . ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరింత ముమ్మరం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు