ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. అమరావతిని బంగారు బాతుతో పోల్చడాన్ని నవ్విపోతున్నారు. అయితే, ఈ బంగారు బాతు ఎవరికి బాబూ అని కూడా ప్రశ్నిస్తు న్నారు. టీడీపీ నేతలకు, అప్పటి అధికారంలో ఉన్న మంత్రులకు ఇది బంగారు బాతు అయి ఉంటుందేమో.. తప్ప రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఎలా బంగారు బాతు అవుతుందో చెప్పాలనే కామెంట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడం గమనార్హం.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై మాటలయుద్ధం చేయడం, ఆ మధ్యలోనే తన మనసులో మాటలను దాచాలన్నా దాగవులే అన్నట్టుగా బయట పెట్టుకోవడం వంటివి జరిగిపోయాయి. ఈ క్రమంలోనే బాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సటైర్లు కుమ్మేస్తున్నారు. రాజధానిని బంగారు బాతని, కానీ, జగన్ ప్రభుత్వం దీనిని చంపేసిందని బాబు వ్యాఖ్యానించారు. అయితే, బంగారు బాతు మాత్రం అక్కడి రైతులకు కానీ, ప్రజలకు కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికికానీ ఎంతమాత్రమూ కాదనే విషయం బాబుకు తెలియందికాదు.
కేవలం ఇక్కడ భూములు పుచ్చుకున్న కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు మాత్రమే ఈ రాజధాని బంగారు బాతు. ఒకవేళ బాబు చెబుతున్నట్టు రాజధాని ప్రాంతం బంగారు బాతే అయితే.. ఎందుకు దీనిని నిర్లక్ష్యం చేశారు? అనేది కీలక ప్రశ్నగా నెటిజన్లు అడుగుతున్నారు. అదే సమయంలో శాశ్వత నిర్మాణాలను ఎందుకు నిర్మించలేక పోయారు? అనేది కూడా ప్రశ్నగా ఉంది. కేవలం జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఏకైక ఉద్దేశంతోనే చంద్రబాబు రాజధాని అంశాన్ని ప్రస్తావించారని అంటున్నారు.
రాజధాని అంటే కొందరికి ఉపయోగపడేదిమాత్రమే కాదని , రాష్ట్ర ప్రజల అవసరాలను కూడా ప్రతిబింబించాలని కూడా కోరుతున్న వారు పెరుగుతుండడం గమనార్హం. కానీ, అప్పట్లోనే ప్రజలకు ఎలాంటి సమాధానం ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం వారిని పట్టించుకుంటారని ఆశించలేమనేది విశ్లేషకుల మాట. సో.. బాబు ఏమంటారో చూడాలి.