కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మంగళవారం రాత్రి మూడు గేట్లు సుమారు పది అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మంగళవారం రాత్రి కంటే బుధవారం ఉదయం వరకు వరద ఉధృతి మరింత పెరగడం తో, మరో నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వరుసగా ఏడవ సారి శ్రీశైలం జలాశయం గేట్లను తెరిచి కిందకి నీరు వదలడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడుసార్లు గేట్లను తెరిచి నీటిని కిందకు విడుదల చేసినట్లుగా అధికారులు వెల్లడించారు .
మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగడం తో అధికారులు దాదాపు అన్ని గేట్లను తెరిచి కిందకు నీటిని విడుదల చేశారు . దీనితో నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండు కుండలా మారింది . దాంతో చేసేది లేక నీటిని సముద్రం లోకి విడుదల చేశారు . ఎగువ రాష్ట్రాలతో పాటు , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ సారి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిరంతరాయంగా వరద ఉధృతి కొనసాగుతుండడం తో తరుచూ గేట్లను తెరిచి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు .
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు నిల్వ ఉండగా , స్పిల్ వే ద్వారా లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మరో 68 వేల క్యూసెక్కుల వదులుతున్నారు . అయినా వరద ఉధృతి కొనసాగుతుండడం తో మరోసారి గేట్లను తెరిచినట్లు అధికారులు తెలిపారు. ఇక శ్రీశైలం జలాశయాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా , పొరుగు రాష్ట్రాల వారు కూడా క్యూ కడుతున్నారు .