హుజుర్నగర్ ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త జోష్ను తీసుకువస్తోంది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మరికాసేపట్లో హుజుర్నగర్ తుది ఫలితం వెలువడనుండగా...పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తుది ఫలితం వెలువడిన తర్వాత
తెలంగాణ భవన్లో
మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...ఆయన ఫలితం నుంచి మొదలుకొని...ఆర్టీసీ సమ్మె, విపక్షాలు, జాతీయ రాజకీయాల గురించి స్పందించనున్నట్లు తెలుస్తోంది.
తొలి రౌండ్ నుంచి 13వ రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డినే ఆధిక్యంలో ఉన్నారు. శానంపూడి సైదిరెడ్డికి తొలి రౌండ్లో టీఆర్ఎస్ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్లో 6,777, నాలుగో రౌండ్లో 9,356, ఐదో రౌండ్లో 11 వేలు, ఆరో రౌండ్లో 12,356, ఏడో రౌండ్లో 14,300, ఎనిమిదో రౌండ్లో 17,400, తొమ్మిదో రౌండ్లో 19,200, పదో రౌండ్లో టీఆర్ఎస్కు 20 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 11వ రౌండ్లో 21,618, 12వ రౌండ్లో 23,821 ఓట్ల మెజార్టీ వచ్చింది.
సైదిరెడ్డి విజయం ఖాయం కావడంతో
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామాతో ఈ నెల 21న హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి
సైదిరెడ్డి,
కాంగ్రెస్ తరపున ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతితోపాటు మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీచేశారు. 302 పోలింగ్ కేంద్రాల్లో 2,36,842 మంది ఓటర్లకుగాను 2,00,754 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఫలితాల టీఆర్ఎస్ పాలనకు గీటురాయిగా భావిస్తున్న తరుణంలో...పార్టీ అభ్యర్థి శానంపూడి
సైదిరెడ్డి విజయం ఖాయమవడం...ఇతరత్రా పరిణాలపై
కేసీఆర్ తనదైన శైలిలో స్పందించనున్నట్లు సమాచారం.