రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధికి అనేక మంది ప్రజలు బలి అవుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్‌ కుమార్‌ జోషి సహా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే  అసలు జనవరిలో 85గా ఉన్నడెంగ్యూ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే  చాలా దోమలు ఉన్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై తీవ్ర  చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపారు. ఒకవేళ డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగ్యూ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్  మొదటి వారానికి వాయిదా
వేసినట్లు పేర్కొంది.

మీరు ఈదేసం పౌరులు కాదా?అంటూ తెలంగాణ ఐఏఎస్‌లను  న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని వాళ్లకు హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం కూడా చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: