ఆర్టీసీ కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ, ఆర్టీసీ యూనియన్లకు ముగింపు అన్నది ఉండదని ఆయన స్పష్టం చేశారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఆర్టీసీ ఉంటుందన్న అయన , ముగింపు ఎవరికో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇవే ఆర్టీసీ యూనియన్లు , ఉద్యోగ సంఘాలు ఆనాడు కేసీఆర్ వెంట నడిచాయని అశ్వద్ధామ రెడ్డి గుర్తు చేశారు ఆర్టీసీ యూనియన్లు ఉద్యోగ సంఘాలు సబ్బండ వర్గాల ప్రజల వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తుచేశారు.
ఆర్టీసీ ప్రభుత్వం జాగీర్ కాదని, 1932 లో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు ఎప్పటికి ముగింపు ఉండదని చెప్పారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ తాను మాట్లాడిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్న అశ్వద్ధామ రెడ్డి ... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఉండాలన్న విషయాన్ని మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. ఒక్క సంతకం తో రోడ్డుపైకి ఏడువేల ప్రైవేట్ బస్సులు వస్తాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థ ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారా? అంటూ పలువురు నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్ మినహాయించి మిగతా తెలంగాణ జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ ఒక్క టీఎస్ ఆర్టీసీ నేనని గుర్తు చేస్తున్నారు . టీఎస్ ఆర్టీసీ ప్రైవేటు పరం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే రేపు లాభాలు వచ్చే రూట్లలోనే అద్దె బస్సుల ఆపరేటర్స్ నడుపుతారని కానీ, సామాన్య ప్రజలు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులను ఎవరు నడుపుతారంటూ విపక్ష నేతలు కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు . పల్లె వెలుగు బస్సులను అద్దె బస్సుల యాజమాన్యం నడుపుతుందా నిలదీస్తున్నారు.