జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ సీబీఐ కేసుల వల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. దీనిపై వైసీపీ శ్రేణులు, నాయకులు మండిపడుతున్నారు. పవన్.. సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.
ఆయన ఏమన్నారంటే.. “ చంద్రబాబు ఉదయం మాట్లాడింది. పవన్ కల్యాణ్ సాయంత్రం మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నాడు. సొంతంగా పార్టీ పెట్టానని చెప్పుకోవడం కాదు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్, చంద్రబాబులకు లేదని, స్థాయి తెలుసుకొని మాట్లాడాలన్నారు. వైయస్ జగన్ ధైర్యసాహసాలతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు.
సోనియాగాంధీని ఎదిరించిన నిలబడిన నాయకుడిపై తప్పుడు కేసులు బనాయించారని, దీనిలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని తప్పుడు కేసులు పెట్టించారన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ కళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. నేరం మోపబడిన వ్యక్తి దోషి ఎలా అవుతారు.. వెయ్యి పుస్తకాలు చదివితే వచ్చిన జ్ఞానం ఇదేనా..? ఏ పుస్తకంలో, ఏ రాజ్యాంగంలో చెప్పారో పవన్ కల్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు.
నేరం మోపబడితే విచారణ జరుగుతుంటే.. దోషిగా చిత్రీకరించడం మన దేశ రాజ్యాంగంలో ఉందా..? నేరారోపణ చేయబడినవారు నేరస్తులు కాదు.. నిరూపణ అయిన తరువాతే దోషులు అవుతారు. వేల పుస్తకాలు చదివినా కూడా ఈ కనీస జ్ఞానం రాలేదా..? పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు.. ఏం మాట్లాడుతాడో తెలియదు. అర్థం కాకుండా బాధ్యతారహిత మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ పర్యటన మీద చంద్రబాబు, పవన్ ఇద్దరూ అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బరితెగించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడుతారు. ప్రజల నమ్మకాన్ని వైసీపీ పలుచన చేసింది అని పవన్ మాట్లాడడం బాధ్యతారహితం.. అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు.