టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది.! బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు... బెయిల్ మంజూరు చేయాలని ఆదేశం ఇచ్చింది. ఇటీవల బంజారాహిల్స్ స్టేషన్లో దాఖలైన కేసులో బెయిల్ వచ్చిన రోజే మరో కేసులో రవిప్రకాష్ను అరెస్టు చేశారు. ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఏబీసీఎల్ ఖాతాల నుంచి రవిప్రకాష్ అక్రమంగా 18 కోట్లు డ్రా చేశారనే అభియోగంపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ అభియోగాలపై అరెస్టు చేయడాన్ని రవిప్రకాష్ హైకోర్టులో సవాల్ చేశారు. దానిపై తాజాగా బెయిల్ పొందారు. పర్సనల్ బాండు, రెండు 15 వేల ష్యురిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశారన్న అభియోగాలపై రవి ప్రకాష్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఓ కేసులో బెయిల్ పొందిన సమయంలో...తిరిగి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఫోర్జరీ మెయిల్ కేసులో ఆయనను విచారణ నిమిత్తం పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పక్క రవిప్రకాష్ న్యాయవాదులు బెయిల్ కోరుతూ వేరే పిటిషన్ను దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు తాజాగాబెయిల్ మంజూర్ చేసింది. ఈ మేరకు కూకట్పల్లి కోర్టును హైకోర్టు ఆదేశించింది. కాగా, తీర్పు కాపీ పోలీసులకు అందిన అనంతరం రవిప్రకాష్ విడుదల కానున్నారు.
కాగా, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్కు బెయిల్ విషయంలో హైకోర్టు జడ్జి జస్టిస్ జి.శ్రీదేవి ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో రాగానే పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోందన్నారు.