తమిళనాడు రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఆర్కే నగర్ లోని దిండుక్కల్ బస్టాండ్ సమీపంలోని ఒక దుకాణంలో ప్లేటున్నర చికెన్ బిర్యానీ కేవలం 5 పైసలకే అందించారు. ఈ ఆఫర్ మరవక ముందే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలోని చాకలిపేటలో ఒక వస్త్ర దుకాణ వ్యాపారి  అద్భుతమైన ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ లో భాగంగా ప్రజలకు ఒక రూపాయికి చొక్కా, పది రూపాయలకు నైటీ విక్రయించాడు. 
 
చెన్నై నగరంలోని చాకలిపేటలో ఆనంద్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆనంద్ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుండి నిన్నటివరకు అతి తక్కువ ధరకే చొక్కాలను, నైటీలను ప్రజలకు విక్రయించాడు. మొదట ఆనంద్ ఈ ఆఫర్ 50మందికి మాత్రమే అమలు చేశాడు. కానీ ఈ ఆఫర్ తెలిసి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవటంతో 200 మందికి ఆఫర్ అమలు చేశాడు. 
 
19వ తేదీ నుండి నిన్నటివరకు రోజూ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఆనంద్ అతి తక్కువ ధరకు చొక్కాలు, నైటీలను విక్రయించాడు. ఈ ఆఫర్ లో వస్త్రాలు కొనుగోలు చేయటం కొరకు కొందరు ఉదయం 3 గంటల నుండే క్యూ లైన్ లో నిలబడేవారని సమాచారం. మొదట వచ్చిన 200 మందికి టోకెన్లు ఇచ్చి టోకెన్ల ప్రకారం చొక్కా, నైటీలను ఆనంద్ విక్రయించాడు. కేవలం రూపాయికే చొక్కా, 10 రూపాయలకే నైటీ విక్రయించటంతో కొనుగోలు చేసిన ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. 
 
వ్యాపారి ఆనంద్ మాట్లాడుతూ పేద ప్రజలు దీపావళి పండుగకు ఖరీదైన దుస్తులు ధరించాలనే ఆలోచనతో ఈ ఆఫర్ ను ప్రకటించానని చెప్పాడు. ఇంత తక్కువ ధరకు ఇచ్చే బదులు ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా అనే ప్రశ్నకు ఆనంద్ ఏదైనా ఉచితంగా ఇస్తే ఇచ్చిన వస్తువుకు విలువ ఉండదని చెప్పాడు. అందువలన కేవలం ఒక రూపాయికి చొక్కా, పది రూపాయలకు నైటీ విక్రయించానని ఆనంద్ చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: