ప్ర‌స్తుతం... ఏదో ఒక వాహ‌నం ..అంటే బైక్/ కారు వంటి వాటితో పాటుగా స‌రుకు ర‌వాణ‌, వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే వాహ‌నాలు...కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే ర‌వాణా వాహ‌నాలు గ్రామాలు ప‌ట్ట‌ణాల్లో క‌లిపి స‌గ‌టున‌ ప్ర‌తి రెండు ఇళ్ల‌ల్లో ఇంట్లో ఒక‌రి ఇంట్లో త‌ప్ప‌కుండా ఉంటున్నాయి. దీంతో స‌హ‌జంగానే పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగింది. అయితే, పెట్రోల్ బంకులు పెట్టేందుకు అనుమ‌తులు ఒకింత క‌ఠినంగా ఉన్నాయి. పైగా అవ‌కాశాలు అంత ఈజీగా రావ‌డం లేదు. అయితే,  తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రిటైల్ ఇంధన విక్రయ రంగంలో మునుపెన్నడూ లేనివిధంగా భారీ సంస్కరణకు తెరతీసింది.


వివ‌రాల్లోకి వెళితే...ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన విక్రయ లైసెన్సు పొందడానికి హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్లలోగానీ లేదా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)టర్మినల్స్‌పైనైనా రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే తాజా నిర్ణయం నేపథ్యంలో రూ.250 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీలన్నీ ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. పెట్రోల్, డీజిల్‌ను అమ్మేసుకోవచ్చు. అయితే కొత్తగా పెట్టే బంకుల్లో 5 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సిందే.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకున్న నిబంధనలను సడలించారు. చమురేతర వ్యాపార సంస్థలూ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నిర్ణయం భారతీయ రిటైల్ పెట్రో మార్కెట్‌లోకి మరిన్ని ప్రైవేట్ రంగ, విదేశీ సంస్థల రాకకు దారితీయనుండగా, పోటీని కూడా తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెట్రో వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఐదేళ్ల‌లోగా ఈ నిబంధనను అమలు పరుచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే బంకులను ఏర్పాటు చేసిన మూడేండ్లలోగా సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, బయో ఇంధనాలు లేదా విద్యుత్ ఆధారిత వాహనాల చార్జింగ్ ఏదో ఒక స్టేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు.కేంద్ర ప్ర‌తిపాదించిన కొత్త విధానం మరిన్ని పెట్టుబడులకు దోహదపడుతుంది. ముఖ్యంగా దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. అంతేగాక ఈ రంగంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, ఉద్యోగావకాశాలకు పెద్ద ఎత్తున కలిసొస్తుంది. రిటైల్ ఔట్‌లెట్లు పెరిగితే పోటీ అధికమై వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయి అని జవడేకర్ అన్నారు.
ప్రస్తుతం దేశంలోని పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలవే ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లకు చెందినవి 65,554 ఔట్‌లెట్లున్నాయి. ఇవిగాక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్, రాయల్ డచ్ షెల్ పెట్రోల్ బంకులున్నాయి. ఎస్సార్ ఆయిల్‌కు 5,344, రిలయన్స్‌కు సుమారు 1,400, షెల్‌కు 160 పెట్రోల్ బంకులున్నాయి. ఇక ఐవోసీకి 27,981, హెచ్‌పీసీఎల్‌కు 15,584, బీపీసీఎల్‌కు 15,708 ఉన్నాయి.
2002లో చివరిసారిగా ఇంధన విక్రయ రంగంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సిఫార్సులపై ఈ మార్పులు చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. విదేశీ సంస్థలకు కలిసి రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎస్‌ఏ, సౌదీ అరేబియా ఆరామ్కో, బ్రిటన్‌కు చెందిన బ్రిటీష్ పెట్రోలియం, సింగపూర్ పూమా ఎనర్జీ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారతీయ రిటైల్ ఇంధన మార్కెట్‌లోకి రావచ్చన్న అంచనాలున్నాయి. అదానీ గ్రూప్‌తో కలిసి దేశవ్యాప్తంగా 1,500 పెట్రోల్ బంకులను తెరువాలని టోటల్ యోచిస్తోంది. నిరుడు నవంబర్‌లో లైసెన్సు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బ్రిటీష్ పెట్రోలియం కూడా పెట్రోల్ బంకులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నది. పూమా ఎనర్జీ కూడా ఈ రేసులో ఉండగా, ఆరామ్కో చర్చలు జరుపుతున్నది. నిజానికి 3,500 బంకులు ఏర్పాటు చేసేందుకు బ్రిటీష్ పెట్రోలియం ఎప్పుడో కేంద్రం నుంచి లైసెన్సును దక్కించుకుంది. అయినప్పటికీ పెట్రో ధరల్లో ఒడిదుడుకులు తదితర కారణాల రిత్యా వాటి ఏర్పాటు జరుగలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: