గన్నవరం ఎంఎల్ఏగా
వల్లభనేని వంశీ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన రాజీనామా లేఖను
అసెంబ్లీ స్పీకర్ కు కాకుండా చంద్రబాబునాయుడుకు పంపటంలోనే అసలు వ్యూహం ఉందంటున్నారు
పార్టీ నేతులు. ఒక విధంగా పార్టీలో తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమా అండ్ కో
చేస్తున్న కుట్రలను ఛేదించలేకే వంశీ పార్టీలో ఉండదలచుకులేదు. అదే సందర్భంలో ఎంఎల్ఏ
పదవికి కూడా రాజీనామా చేసేశారు.
అంటే వంశీ లెక్క ప్రకారం తానిప్పుడు తెలుగుదేశంపార్టీ నేత కాదు. అలాగే ఎంఎల్ఏ పదవికి చేసిన రాజీనామాను చంద్రబాబు స్పీకర్ కు పంపే అవకాశం కూడా లేదు. అంటే రాజీనామాను చంద్రబాబు స్పీకర్ కు పంపి దాన్ని ఆయన ఆమోదించే వరకూ వంశీ ఎంఎల్ఏగానే ఉంటారు. కాబట్టి రాజీనామా స్పీకర్ కు అందేది లేదు దాన్ని ఆయన ఆమోదించే అవకాశమూ లేదు.
అంటే వంశీ టిడిపితో సంబంధం లేకుండా తటస్త ఎంఎల్ఏగా కొనసాగుతునే ఉంటారన్నమాట. బహుశా జగన్మోహన్ రెడ్డితో భేటి సమయంలో మాట్లాడుకున్న విషయం ఇదే అయ్యుంటుందని తెలుగుదేశంపార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే ఎంఎల్ఏ రాజీనామా ఆమోదం పొందటమో లేకపోతే పార్టీ మారితే అనర్హత వేటు పడటమో జరగాలి.
కానీ వంశీ మాత్రం రెండింటికి మధ్యే మార్గం ఎంచుకున్నట్లు టిడిపి నేతలంటున్నారు. రాజీనామా చేసిన కారణంగా వంశీ టిడిపి నేత కాదు కాబట్టి అధికారపార్టీ వేధింపుల నుండి తప్పించుకోవచ్చని ఎంఎల్ఏ భావిస్తున్నారట. వేధింపుల ప్రస్తావన వంశీనే తన లేఖలో ప్రస్తావించారు లేండి.
అదే సమయంలో నియోజకవర్గానికి ఉపఎన్నిక అవసరం కూడా తప్పుతుందట. అంటే ఇలా ఎంతకాలం వీలైతే అంత కాలమూ నెట్టుకు రావాలని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ పద్దతి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉందా ? ఉందా అంటే ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులు కొత్త కొత్త పంథాలను అనురిస్తున్న కారణంగా చట్టాలు కూడా అప్ డేట్ అవ్వాల్సొస్తోంది. మరి న్యాయనిపుణులు ఏం చెబుతారో చూడాల్సిందే.