టీడీపీలో కీలక నేత, పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన
మాస్ లీడర్ వల్లభ నేని
వంశీ మోహన్ ఆ పార్టీకి, తానుప్రాతినిధ్యం వహిస్తున్న
ఎమ్మెల్యే పదవికి కూడా తాజాగా
రాజీనామా చేశా రు. రాజకీయాల్లో నాయకులు గోడదూకడం, పార్టీలు మారడం కామనే అని సరిపెట్టుకుంటే.. దీనిని కూడా అంతటితో ఆపేసుకోవచ్చు. కానీ,
వంశీ రాజీనామా వెనుక ఉన్న విషయాన్ని అర్ధం చేసుకుంటే.. చంద్ర బాబు వంటి మేధావిని యువ నాయకుడు వదిలేసి వెళ్లిపోవడం, తృణప్రాయంగా పార్టీకి, పదవికి కూడా
రాజీనామా సమర్పించడాన్ని ఆలోచిస్తే.. బాబుకు పెద్ద లెస్సనే బోధపడాలి.
మరి అదేంటో చూద్దాం. చంద్రబాబు తరచుగా చెప్పే.. తానే దేశంలోని రాజకీయ నేతల్లో సీనియర్. తనను మించిన పొలిటికల్ అపర చాణిక్యుడు మరెవరూ లేరు. ఆఖరుకు మోడీతో సహా(ఇది కూడా బాబే చెప్పుకొ న్నారు) . అయితే, ఇప్పుడు ఇలాంటి మేధావిని కాదని
వంశీ ఎందుకు పార్టీకి గుడ్ బై చెప్పారు? తాను చంద్రబాబుకు రాసిన లేఖ లో ఎందుకు అసంతృప్తిని, నిర్వేదాన్ని వ్యక్తం చేశారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. కానీ, లేఖలో మరో విషయాన్ని కూడా
వంశీ ప్రస్తావించారు. నేరుగా వచ్చే శతృవును ఎవరైనా ఎదిరించగలరు.. కానీ, పక్కనే ఉండి గోతులు తవ్వే వారిని ఎలా అడ్డుకుంటాం.. అని! మరి ఇది ఇతర పార్టీల నుంచి వచ్చే సమస్యేనా? లేక సొంత పార్టీలోనే ఉన్నారా?
ఇలాంటి విషయాలను పరిశీలిస్తే.. టీడీపీలోనే అంతర్గతంగా ఏదో జరుగుతోందనే భావన తెరమీదికి వస్తోంది. ఎంత సేపూ.. తనను తాను ఎస్టేమ్ వేసుకుని, తనను తాను మేధావిగా ప్రమోషన్ చేసుకునేందుకు బాబు తపిస్తున్నారే తప్ప.. పార్టీలోని నాయకులపైనా, కొందరు నాయకులు చేస్తున్న ఆధిపత్య రాజకీయాలపైనా ఆయన దృష్టి పెట్టలేదు. అదేసమయంలో పార్టీలో ఎవరు కీలకం అనే విషయంపైనా బాబు పెద్దగా ఆలోచన చేయడం లేదనేది వాస్తవం. అవసరం లేకపోయినా..
వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో కలుపుకొన్నారు. అదేసమయంలో ఆధిపత్య రాజకీయాలపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు.
ఇది రానురాను పార్టీ అనే మహావృక్షాన్ని పెకలించే పరిస్థితి వచ్చంది. ఇప్పుడు
వంశీ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ విషయాన్ని వదిలేసి.. కేవలం వంశీపై కేసులు ఉన్నాయి కాబట్టే ఆయన పార్టీకి.. పదవికి
రాజీనామా చేశారని అంటే.. అది కన్నీళ్లు తుడుచుకున్న చందంగాను, అధికార పార్టీని టార్గెట్ చేసినట్టుగానే ఉంటుంది తప్ప.. మరేమీ లేదు. అలా కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని బాబు ఇప్పటికైనా గమనించాలి. నాయకులను పిలిపించో.. తానే వెళ్లో వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలి.
వంశీ రాజీనామా వెనుక ఉన్న పాఠాలను గమనించి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.. అని మేధావులు సూచిస్తున్నారు.