ఏపీ రాజకీయాలు ఇపుడు క్రిష్ణా
జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి.
దీపావళి మొదలవకముందే పెద్ద బాంబు పేల్చి గమ్మున కూర్చున్నారు గన్నవరం టీడీపీ
ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. దాంతో ఇపుడు టీడీపీ కకావికలమవుతోంది.
వంశీ తన రాజీనామాను, టీడీపీ సభ్యత్వానికి గుడ్ బై కొట్టడంతో రాజకీయం యమ రంజుగా సాగుతోంది. అయితే
వంశీ రాజీనామా చేశారా లేదా అన్నది ఒక పెద్ద డౌట్ గానే ఉంది. ఆయన వాట్సప్ లో
రాజీనామా పంపడమేంటని సాటి తెలుగు తమ్ముడు, మాజీ
ఎమ్మెల్యే బోండా ఉమా ఓ విధంగా సెటైర్ వేశారనే అనుకోవాలి.
ఇదిలా ఉండగా
వంశీ రాజీనామా కధ ఏ వైపు తిరుగుతుందన్నది కూడా ఇపుడు ఆసక్తిగా మారింది.
వంశీ టీడీపీలో ఉంటే ఆయన మీద వైసీపీ కేసులతో దాడులు చేస్తోందని చెప్పి పొలిటికల్ మైలేజ్ పొందవచ్చునని పసుపు
పార్టీ పెద్దలు గట్టిగానే స్కెచ్ వేస్తున్నారు. కానీ
వంశీ మాత్రం
రాజీనామా చేసేశాను అంటున్నారు. దాంతో ఇపుడు టీడీపీ హై కమాండ్ కీ ఏమీ పాలుపోలేదంటున్నారు.
ఇక మరో వైపు
వంశీ ముఖ్యమంత్రి జగన్ని కలసి వచ్చారు. ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం ఓ వైపు సాగుతున్నా మరో వైపు మాత్రం ఆయనకు
జగన్ నుంచి సరైన భరోసా లభించలేదని అంటున్నారు. తప్పుడు పత్రాలపైన ఇళ్ళు మంజూరు చేయించారన్న ఆరోపణలు
వంశీ మీద ఉన్నాయి. దాంతో ఈ కేసు కూడా అచ్చం
చింతమనేని తరహాలోనే ఉందని అంటున్నారు.
వంశీ పై కేసులు ఉన్నాయి. ఆయన వైసీపీలో చేరినా కూడా కేసులు ఆగవని
జగన్ క్లారిటీగా చెప్పేయడంతోనే ఆయన ఇపుడు
రాజీనామా చేస్తున్నట్లుగా చెబుతున్నారని కూడా అంటున్నారు. మరి నిజానిజాలు ఎలా ఉన్నా
వంశీ విషయంలో టీడీపీ హై కమాండ్ కి హై బీపీ పెరిగిపోతోంది. రేపటి నుంచి చంద్రబాబు క్రిష్ణా
జిల్లా టూర్ ఉంది. ఈ నేపధ్యంలో అలజడి స్రుష్టించిన
వంశీ కధకు ముగింపు సజావుగా ఉంటుందా, అది టీడీపీకి అనుకూలంగా ఉంటుందా అన్నది చూడాలి మరి.