రాజ‌కీయాల్లో ఆద‌ర్శం అనేది అంత తేలిక విష‌యం కాదు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, వారికి సేవ చేయ‌డం అనేది నాయ‌కులు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పే మాట‌లు. ఏ నాయ‌కులైనా ఇప్పుడు వ్యాపార సంబంధాలు లేకుండా లేరు. ఏదొ ఒక వ్యాపారంలో త‌ల‌మున‌క‌లై ఉంటున్నారు. దీంతో వారు ఎన్నిక‌లకు ముందు ప్ర‌జ ల‌కు ఇచ్చే కీల‌క‌మైన హామీలు నెర‌వేర్చేందుకు నానా ప్ర‌యాస ప‌డుతుంటారు. దీంతో ఎన్నిక‌ల్లో ఇచ్చే హామీల‌ను నెర‌వేర్చే నాయ‌కులు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు.


కానీ, వైసీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే మాత్రం తాను ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకునే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీనిని అమ‌లు కూడా చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. వారంలో నాలుగు రోజులు ఆయన త‌ను ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఈ విష‌యం తెలుసుకుని, తాము కూడా ఇలా చేస్తే.. ఆ ఎమ్మెల్యే బాట‌లో న‌డిస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారట‌. తాజాగా ఈ విష‌యంపై జ‌గ‌న్ కూడా దృష్టి పెట్టార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.


ఇంత‌కీ, ఆయ‌న ఎవ‌రో కాదు. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. ఈయ‌న ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుడు(ఇప్పుడు బీజేపీ లోకి చేరిపోయారులేండి) వ‌ర‌దా పురం సూరిపై ఘ‌న విజ‌యం సాధించారు. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. వారానికి నాలుగు రోజులు మీకు అందుబాటులో ఉంటాను... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాను.. నేనే మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే కేతిరెడ్డి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వెంట‌నే ``గుడ్ మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం`` పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు.


నిత్యం త‌నే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. వార్డుల వారీగా వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు వారి స‌మ‌స్య‌లు వింటున్నారు. అప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్క‌రించ‌గ‌లిగే స‌మ‌స్య‌లు ఉంటే.. వాటికి వెంట‌నే మోక్షం క‌ల్పిస్తు న్నారు. అధికారుల‌తో మాట్లాడి త‌ర్వాత ప‌రిష్క‌రించ‌గ‌లిగేవే అయితే.. తానే స్వ‌యంగా ఓ డైరీ పెట్టుకుని న‌మోదు చేసుకుంటున్నారు. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ విష‌యం ఆనోటా.. ఈ నోటా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తెలిసింది. దీంతో ఆయ‌న రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారుల‌కు ఈ విష‌యాన్ని చెప్పి వారి ద్వారా ఎమ్మెల్యేల‌కు చేర‌వేశారు. దీంతో ఇప్పుడు ఈ బాట‌లో న‌డిచేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారట‌. మ‌రి ఎంత మంది స‌క్సెస్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: