కూడు, గూడు,గుడ్డ ఇవి  కనీస అవసరాలు. కానీ వీటికి ముందు నీరు, గాలి ప్రాణాధారం. కలుషితం ఐన గాలితో ఎలాగోలా బ్రతికేస్తున్నాం. కానీ  దాహం తీరడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి తెలంగాణాలో ఇప్పటికి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో  నిత్యం ఏదో ఒక ఏరియాలో తాగునీటి సమస్య ఉంటుంది.  అయితే అలకాపూర్ టౌన్ షిప్ కాలనీలో తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. తమ కాలనీలో డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బందిపడుతున్నామని..తాగునీటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు.  తమ కాలనీకి తాగునీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు చిన్నారులు.

ప్రియమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ.. మాకు మంచినీళ్ల సౌకర్యం కల్పించండి.  ఉన్న నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి’ అంటూ కొందరు చిన్నారులు కలిసి రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు, ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. ఐదేళ్లుగా తాగడానికి మంచి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన నీళ్లని పొందడం మానవుడి ప్రాథమిక హక్కు అని, ప్రజలకు అధికారులు కల్పించాల్సిన కనీస సౌకర్యం మంచినీరే అని వారు ఉత్తరంలో పేర్కొన్నారు.

తమకు  తాగేందుకు మంచి నీరు అందట్లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.  హైదరాబాద్ మెట్రోపొలిటన్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డుకి కూడా పోస్టు కార్డులు పంపారు. ఈ రోజు ఉదయం స్వామి వివేకానంద పార్కుకి తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నారులు తమ ప్రాంతంలోని మంచి నీటి సమస్యపై నిరసనను తెలిపారు. పిల్లల అభ్యర్థనను ముఖ్యమంత్రి, మంత్రి గార్లు తీర్చాలి అని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

గతంలో మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలకాపూర్‌ టౌన్‌షిప్‌ వాసులు నీళ్లకోసం  ప్రధాన రహదారిపై చేయిచేయి కలిపి మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు.  ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ పోస్టుకార్డు ఉత్తరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ చిన్నారులు చేసిన విన్నపానికి చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: