గత కొద్ది రోజులుగా ఏపీలో కొన్ని విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపి, వైసీపీ పార్టీలమధ్య మాటలయుద్ధం నడుస్తుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టింది. పేద ప్రజల కోసం మరిన్ని కొత్త కొత్త పధకాలు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇకపోతే రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం మొదలుపెట్టనుంది. ఇక తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వలంటీర్లు వారి ఇంటివద్దకే వెళ్లి నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డుల వారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1 నుండి 14వ తేదీల మధ్య ప్రత్యేకంగా సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ఇకపోతే తుది పింఛనుదారుల జాబితాను డిసెంబర్ 15న ప్రకటించి..
కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్టు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదివరకే ఈ వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, పింఛన్ల విషయంలో ప్రతిపక్షాలు నానాయాగి చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ పింఛన్ల అమలు జరగడం మొదలైందంటే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోటికి తాళం పడ్డట్లే అని అనుకుంటున్నారు జగన్ అంటే అభిమానం ఉన్న కొందరు.