నేటి సమాజంలో మనిషి మనిషిలా జీవించడం లేదు. తాను కౄరంగా మారి ఎదుటి వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు. అడవిలోని జంతువులైన ఒక్కోసారి జాలిపడి వదిలేస్తాయి. కాని మనిషి అనే వాడిలో మచ్చుకైన జాలి, మానవత్వం గాని కనబడటంలేదు. ఇదే కాకుండా కన్నవారి పాలిట వారి పిల్లలే యమభటుల్లా మారి ప్రాణాలు తీసే నీచ సంస్కృతి ఈ మధ్యకాలంలో సమాజంలో పెరిగిపోతుంది. దీన్నిబట్టి చూస్తే ఇప్పుడు సహజంగా మరణించడానికి బదులుగా వారిచేతిలో చావడానికే పిల్లల్ని కంటున్నాం అవే భావన తలెత్తుతుంది.


సాటి మనిషిని కళ్లముందే జంతువును బలి ఇచ్చినట్లుగా ఇస్తుంటే ఎక్కడో ఓ మూలనైన దయకలగడం లేదు ఈనాటి రాక్షసులకు, కనీసం వారు తమను కన్నవారు అనే జ్ఞానం కూడ లేకుండా మారిపోతున్నారు. ఇక కొందరు తమ కామవాంచ కోసం ఇలాంటి దారుణాలు చేస్తుంటే, మరి కొందరు ఆస్తికోసం ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఒకడు కన్న కొడుకై ఉండి తన తల్లిదండ్రులను సభ్యసమాజం సిగ్గుపడేలా, కౄరాతి కౄరంగా చంపాడు. కనీసం ఆ సమయంలో వాడికి కన్నవారి గుండెలపై ఆడుకున్న రోజులైన గుర్తురాలేదా?  అమృతం లాంటి తల్లి పాల తీపినైన ఎరుగలేదా ? ఇంత నీచానికి ఎల తెగబడ్డాడో, అంతలా కఠినంగా ఎలామారాడో. ఇక వివరాల్లోకి వెళ్ళితే ..


చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు బతికుండగానే కాల్చి చంపాడు. తల్లిదండ్రులను మంచానికి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కన్నవారు అని కూడా కనికరించని ఆ కిరాతకుడు తన కొడుకుతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూక్యా దస్రు (68)కు  10 ఎకరాలు భూమి ఉండగా.. కుమారులు కేతూరాంకు 3.30 ఎకరాలు, వీరన్నకు నాలుగెకరాలు పంచి ఇచ్చాడు. తన బ్రతుకు దెరువుకోసం రెండున్నర ఎకరాల భూమి తనవద్ద ఉంచుకున్నాడు.


ఇకపోతే చిన్న కొడుకు వీరన్న కొంతకాలం క్రితం మరణించగా దస్రు తన వద్ద ఉన్న భూమిని వీరన్న భార్య పేరిట పట్టా చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల పట్ల కక్ష పెంచుకున్న పెద్దకొడుకు కేతూరాం, అతడి కుమారుడు వెంకన్న.. బుధవారం సాయంత్రం వృద్ధ దంపతులను మంచానికి కట్టేసి వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆ ఇద్దరిపై పోసి నిప్పంటించారు.


ఇక వారు ఉంటున్న ఇంట్లో నుంచి పొగలు, రావడంతో గ్రామస్తులు ఎం జరిగిందోనని భయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నెక్కొండ పోలీసులు గ్రామస్తులతో కలసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయిన వృద్ధ దంపతుల మృతదేహాలు మంచం మీద అస్తిపంజరాలుగా మారి కనిపించాయి. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: