సాప్ట్వేర్ ఇంజినీర్లకు షాక్. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్
టెక్నాలజీ సొల్యూషన్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. తన సంస్థ నుండి భారీగా ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గతంలో భారీగా ఉద్యోగులను తొలగించినట్లే...ఈ దఫా అదే తరహాలో నిర్ణయం తీసుకోనుందట. రాబోయే త్రైమాసికాల్లో మొత్తం 7,000 మంది మిడ్-సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. సంస్థ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
కీలకమైన కాంట్రాక్ట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో...కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ యొక్క కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్లలో ఒకటైన
కాగ్నిజెంట్, దాని కాంట్రాక్ట్ పూర్తయిన తరువాత ఈ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుంది. ఈ నిర్ణయం సుమారు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఫేస్ బుక్ కంటెంట్ పై పనిచేసే మోడరేటర్ల యొక్క పని వాతావరణం..మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కంపెనీలో 3లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా..వీరిలో రెండు లక్షల వరకు భారతీయులే ఉన్నారు.
ఇదిలాఉండగా, ఇటీవలే కాగ్నిజంట్లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్ తెలిపింది. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం లక్ష మంది మహిళా ఉద్యోగులను
2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 2019లోనే దాన్ని సాధించేసింది. పైగా వారిలో 75 శాతం భారత్ నుంచే పనిచేస్తుండడం విశేషం.