తన విచ్చలవిడితనాన్ని ప్రశ్నించిందని  కన్నతల్లిని హత్య చేసిన హయత్ నగర్ కీర్తి ఉదంతాన్ని మరువకముందే ఆస్తి కోసం గుంటూరులో మరో యువతి తన తల్లిని కర్కశంగా హతమార్చిన సంఘటన సమాజం ఎటుపోతుందో అనే భయాన్ని కల్గిస్తోంది. కన్న కూతుర్లే జన్మనిచ్చిన వారి ఆయువు తీస్తున్న సంఘటనలు వరుసుగా జరుగుతుండటంపై సర్వత్రా భయాందళోనలు వ్యక్తమవుతున్నాయి. 


  గుంటూరు జిల్లా నగరపాలెంకు చెందిన భార్గవి అనే యువతి రూ. 10 లక్షల ఆస్తి కోసం తన కన్నతల్లినే కడతేర్చింది. తన బావ, భర్త సహకారంతో ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. నగరపాలెం ప్రాంతానికి చెందిన ఆలపాటి లక్ష్మికి సంబంధించిన ఆస్తిపై ఆమె కూతురు భార్గవి గత కొంతకాలంగా కన్నేసింది.

దీనికి సంబంధించి ఆమె పలుమార్లు తన తల్లితో చర్చించింది. తల్లి మాట వినడం లేదని భావించిన భార్గవి తన భర్త రామాంజనేయులు, బావ శివరావుతో కలిసి లక్ష్మిని హత్య చేయడానికి సిద్ధమైందని పోలీసులు తెలిపారు. పక్కా  ప్లాన్ ప్రకారం లక్ష్మిని హత్య చేసిన భార్గవి.. దాన్ని సాధారణ మరణంగా చూపించాలని ప్రయత్నించింది. 
  లక్ష్మి మరణంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.


       కాగా వారం రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూతుర్ల చేతిలో కన్నతల్లులు హత్యకు గురికావడం ద్రిగ్భాంతిని కలిగిస్తోంది. ప్రేమగా చూసుకుంటారనుకున్న కూతుర్లే..  ఆ తల్లుల పాలిట మృత్యువులుగా మారటం చాలామందిని భయపెడుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి కూతుర్లు పుట్టడం ఆ తల్లుల దురదృష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: